రాసిచ్చేశారు..!
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:52 PM
పంచాయతీ అనుమతి లేకుండానే రాసిచ్చేశారు. అది కూడా మూడు చెరువులు కలిపి రూ.25 వేలకే అప్పగించేశారు.
అభ్యంతరం తెలిపిన సర్పంచ్, వార్డు సభ్యులు
తీర్మానం లేకుండా ఎలా కేటాయిస్తారని నిలదీత
మద్దికెర, సెప్టెంబరు 20: పంచాయతీ అనుమతి లేకుండానే రాసిచ్చేశారు. అది కూడా మూడు చెరువులు కలిపి రూ.25 వేలకే అప్పగించేశారు. ఎలాంటి తీర్మానం లేకుండానే చేపల పెంపకానికి అధికారులు అనుమతి ఇవ్వడంపై సర్పంచ్, వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్దికెర పంచాయతీ పరిధిలో యజ్ఞం చెరువు, భవనాసి, మద్దమ్మ కుంటలు ఉన్నాయి. ఇవి దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి. వీటిని ఏటా హంద్రీ నీటితో నింపుతారు. ఈ సారి కూడా హంద్రీ నీరు వదలడంతో కళకళలాడుతున్నాయి. అయితే గ్రామంలోని బెస్త కులానికి చెందిన కొంత మంది తాము చేపలు వదులుకొని జీవనం సాగిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం నుంచి జీవో కూడా ఉందంటూ అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం సర్పంచ్ బండారు సుహాసినికి, పంచాయతీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా డీఎల్పీవో ప్రకాష్ నాయుడు గ్రామానికి చేరుకొని బెస్త కులస్థులకు మూడు చెరువులను రాసిచ్చాడు. పంచాయతీ కార్యదర్శి శివకుమార్ ఆధ్వర్యంలో ఏడాదిపాటు చేపలు వదిలి పట్టుకోవడానికి మూడు చెరువులను కలిపి రూ.25 వేలకు రాసిచ్చాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుహాసిని, పంచాయతీ సభ్యులు ఎన్.లక్ష్మీనారాయణ, జంబునాథ్ రాయుడు, లక్ష్మీదేవి, మరికొంత మంది పంచాయతీ కార్యదర్శి శివకుమార్తో వాగ్వాదానికి దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా రాసిస్తారని నిలదీశారు. పంచాయతీ అభివృద్ధి కోసం గ్రామంలో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్నామని, తమకు తెలియకుండా చెరువులను రాసివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.25 వేలతో చేసేదేమీ లేదని, ఉచితంగా రాసిస్తే పోయేదని అన్నారు. తీర్మానం చేయకుండా పంచాయతీ సభ్యులు, సర్పంచులకు తెలియకుండా రాసిస్తే తమకు ఏమి మర్యాద ఉంటుందని మండిపడ్డారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శివకుమార్ వివరణ ఇస్తూ రాసిచ్చిందాన్ని రద్దు చేస్తామని, పాలక వర్గం సభ్యుల అభిప్రాయం మేరకు అనుమతులు ఇస్తామని అన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 11:52 PM