పట్టించుకునేదెవరు?
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:52 PM
జిల్లా మోడల్ స్కూళ్లను గాలికి వదిలేసినట్లు అనిపిస్తోంది. ప్రిన్సిపాల్ నెలల తరబడి స్కూళ్లకు వెళ్లకున్నా..పట్టించుకునవారు లేరు. కణేకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆదినారాయణ నెలల తరబడి స్కూల్కు డుమ్మా కొట్టారు. స్కూల్ నిర్వహణను గాలికి వదిలేశారు. ఆయన స్కూల్కు వెళ్లకున్నా...అటెండెన్స రిజిస్టర్లో సంతకాలు ఉంటున్నాయి.
మోడల్ స్కూళ్లలో ఇష్టారాజ్యం...!
కణేకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్పై చర్యలేవీ?
తనిఖీలు మర్చిపోయిన విద్యాశాఖ అధికారులు
నేటికీ స్పందించని ఏడీ నాగరాజు
అనంతపురం విద్య, జూలై 23: జిల్లా మోడల్ స్కూళ్లను గాలికి వదిలేసినట్లు అనిపిస్తోంది. ప్రిన్సిపాల్ నెలల తరబడి స్కూళ్లకు వెళ్లకున్నా..పట్టించుకునవారు లేరు. కణేకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆదినారాయణ నెలల తరబడి స్కూల్కు డుమ్మా కొట్టారు. స్కూల్ నిర్వహణను గాలికి వదిలేశారు. ఆయన స్కూల్కు వెళ్లకున్నా...అటెండెన్స రిజిస్టర్లో సంతకాలు ఉంటున్నాయి. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో పెద్దసార్ యాడున్నాడో ...? శీర్షికన కథనం ప్రచురితమైంది. అయితే ఇంత వరకూ ఆ ప్రిన్సిపాల్పై జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. చర్యలు తీసుకోకపోగా...ఆయనకు సపోర్ట్ చేసిన మరో సీనియర్ పీజీటీకి మళ్లీ ఇప్పుడు పట్టం కట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్కూళ్ల తనిఖీలనే మరిచిపోయారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
దొంగల చేతికే తాళాలు...
కణేకల్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన గత కొంత కాలంగా మోడల్ స్కూల్కు రావడం లేదు. జూన, జూలై మాసాల్లో ఆయన స్కూల్లోనే అడుగు పెట్టలేదు. అయినా జీతం మాత్రం డ్రా చేస్తున్నారు. ఆయన స్కూల్కు రాకున్నా ఆయన తరపున మరో సీనియర్ పీజీటీ సంతకాలు చేశారు. స్కూల్కు రాకుండా బయట తిరుగుతున్న ప్రిన్సిపాల్కు సీనియర్ పీజీటీ అన్ని రకాలుగా సహకరిస్తున్నట్టు సమాచారం. విధులకు డుమ్మా కొట్టే ప్రిన్సిపాల్కు మరొకరు సహకరిస్తుండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఏకంగా సంతకాల ఫోర్జరీ వ్యవహారం స్కూల్లో సాగుతోంది. అయితే ఇంత వరకూ ప్రిన్సిపాల్పై చర్యలు లేవు. ప్రిన్సిపాల్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తుంటే...ఆయనకు సహకరించిన సీనియర్ పీజీటీకి ఇప్పుడు ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించాలని విద్యాశాఖ అధికారులు చూస్తున్నట్టు తెలుస్తోంది.
నిద్ర మత్తులో అధికారులు
జిల్లా వ్యాప్తంగా 15 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిని ఏడీ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. కణేకల్లు స్కూల్లో ప్రిన్సిపాల్ నెలల తరబడి హాజరుకాకున్నా గుర్తించలేదంటే ఏడీ పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గతంలో జిల్లాకు వచ్చిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మోడల్ స్కూల్ ఏడీ తీరుపై ఫైర్ అయ్యారు. అయినా ఆయనలో మార్పు కనిపించడంలేదు. అటు విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం మోడల్ స్కూళ్ల పర్యవేక్షణను గాలికి వదిలేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
Updated Date - Jul 23 , 2024 | 11:52 PM