‘హయగ్రీవ’ భూ లావాదేవీల్లో రూ.200 కోట్ల మనీలాండరింగ్!
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:34 AM
హయగ్రీవ’ భూమి అక్రమ బదలాయింపు ద్వారా రూ.200 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగంపై విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు,
ఎంవీవీ, ఆడిటర్ జీవీ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు అందుకే: ఈడీ
విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘హయగ్రీవ’ భూమి అక్రమ బదలాయింపు ద్వారా రూ.200 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడ్డారనే అభియోగంపై విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ)కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటించారు. వృద్ధులకు కాటేజీలు, వృద్ధాశ్రమం నిర్మాణం కోసం హయగ్రీవ ఫర్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు రాష్ట్రప్రభుత్వం 2008లో 12.51 ఎకరాలు కేటాయించింది. రూ.30.25 కోట్ల మార్కెట్ విలువ కలిగిన భూమిని కేవలం రూ.5.63 కోట్లకు కేటాయించింది. అయితే ఆ భూమిని.. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి తమ నుంచి లాక్కున్నారని, ప్లాట్లుగా విభజించి ఇతరులకు విక్రయించేశారని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారంటూ ‘హయగ్రీవ’ సంస్థ ప్రొప్రయిటర్ సీహెచ్ జగదీశ్వరుడు ఈ ఏడాది జూన్లో ఫిర్యాదుచేశారు. ఆరిలోవ పోలీసులు ఎంవీవీ, జీవీతోపాటు గాదె బ్రహ్మాజీ అనే మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ విశాఖ సబ్ జోనల్ కార్యాలయం అధికారులు ఈనెల 19న ఎంవీవీ సత్యనారాయణకు చెందిన 2 నివాసాలు, కార్యాలయంతోపాటు జీవీ నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హయగ్రీవ భూ లావాదేవీల్లో దాదాపు రూ.200 కోట్లు వరకూ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో ఫోర్జరీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు, డిజిటల్ డివైజ్లు, ఎంవీవీ, జీవీతోపాటు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న 300కిపైగా సేల్డీడ్లు, చరాస్తులకు సంబంధించి రూ.50 కోట్లు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించే పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 07:42 AM