99 ఎస్ఎంసీల ఎన్నికకు నోటిఫికేషన్
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:56 AM
జిల్లాలో వివిధ మండలాల్లోని 99 పాఠశాలలకు యజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఏర్పాటుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.
రేపు తుది ఓటర్ల జాబితా
17న చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక
ఒంగోలు(విద్య), ఆగస్టు 10 : జిల్లాలో వివిధ మండలాల్లోని 99 పాఠశాలలకు యజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఏర్పాటుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మొదట షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 2,405 ఎస్ఎంసీ కమిటీల ఏర్పాటుకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కోరం లేకపోవడం, ఇతర కారణాలతో 99 చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఆ పాఠశాలల్లో మళ్లీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ తాజా షెడ్యూల్ను ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో 67 ప్రాథమిక, 15 ప్రాథమికోన్నత, 17 హైస్కూళ్లలో హెచ్ఎంలు శనివారం నోటిఫికేషన్ను జారీ చేశారు. మధ్యాహ్నం ఓటర్ల జాబితాను విడుదల చేసి పాఠశాల నోటీసు బోర్డులో పెట్టారు. సోమవారం అభ్యంతరాలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి అదేరోజు సాయంత్రానికి తుది జాబితాను ప్రకటిస్తారు. 17వతేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు. అదేరోజు మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుని తర్వాత ఎస్ఎంసీ మొదటి సమావేశం నిర్వహిస్తారు.
Updated Date - Aug 11 , 2024 | 12:56 AM