మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరుతో వసూళ్లు
ABN, Publish Date - May 19 , 2024 | 11:57 PM
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికార పార్టీకి చెందిన ఓ దిగువశ్రేణి ప్రజాప్రతినిధి కొంతమంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఆరోపణలు
సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో
ఎమ్మిగనూరు, మే19 : ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికార పార్టీకి చెందిన ఓ దిగువశ్రేణి ప్రజాప్రతినిధి కొంతమంది నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగం కోసం రూ.లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయిన ఓ బాధితుడు తన గోడును ఆడియోరూపంలో సోషల్ మీడియాలో వెల్లగక్కాడు. కొన్ని రోజుల క్రితం ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.2 నుంచి రూ.5లక్షల వరకు మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి పట్టణంలోని పలువురు నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 70 మంది నుంచి డబ్బు వసూలు చేసినట్లు బాధితుడు తన ఆడియోలో వెల్లడించడంతో పట్టణంలో అదికాస్తా వైరల్గా మారింది. అయితే సదరు ప్రజా ప్రతినిధి అక్రమ వసూళ్లుకు మున్సిపాలిటీకి చెందిన ఓ అధికారి సైతం వంతపాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తికి అధికారులు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు లేవు. అంతేగాక కాంట్రాక్టు బేసిక్పైగాని, రోజువారి వేతనంపై గాని ఎవరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు కూడా అధికారులు ప్రకటించలేదు. అయినప్పటికి కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటికి చెందిన ప్రజాప్రతినిధి పలువురికి ఉద్యోగాల ఆశచూపి లక్షల కొద్ది డబ్బు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మున్సిపల్ కార్యాలయం నుంచి అధికారులు మున్సిపాలిటీలో ఎలాంటి ఉద్యోగాలు లేవని, ఉద్యోగాల భర్తికి ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదని, ఉద్యోగాల పేరుతో డబ్బు అడిగితే ఇచ్చి ఎవరూ మోసపోవద్దని ప్రకటనను జారీ చేయడం గమనార్హం. ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన సదరు ప్రజా ప్రతినిధిని వైసీపీ అభ్యర్థి పక్కనపెట్టుకొని తిరగడం పట్ల కూడా పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ వసూళ్ల రాయుడు ఆదోనికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి నుంచి కూడా రూ.10లక్షల మేర వసూలు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరుతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అక్రమ వసూళ్లకు పాల్పడడం పట్టణంలో చర్చనియాంశంగా మారింది.
Updated Date - May 19 , 2024 | 11:57 PM