చీకట్లు తొలిగాయి
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:33 PM
ఐదేళ్ల వైసీపీ చీకటి పాలనకు అంతం పడింది. అన్నివర్గాల ప్రజలు అనుభవించిన ఇబ్బందులకు మోక్షం లభించింది. ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో గెలుపొందింది. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం కూడా కొలువుతీరనుంది. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివెళ్లారు.
- ప్రభుత్వ కార్యాలయాలు ధగధగ
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
అచ్చెన్నతోపాటు మరొకరికి మంత్రిగా చాన్స్
భారీగా తరలివెళ్లిన పార్టీ శ్రేణులు
ఉద్యోగుల్లో పొంగిపొర్లుతున్న ఉత్సాహం
సిక్కోలులో పండగ వాతావరణం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
ఐదేళ్ల వైసీపీ చీకటి పాలనకు అంతం పడింది. అన్నివర్గాల ప్రజలు అనుభవించిన ఇబ్బందులకు మోక్షం లభించింది. ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో గెలుపొందింది. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం కూడా కొలువుతీరనుంది. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో జనం తరలివెళ్లారు. కాగా.. ఇన్నాళ్లూ సాగించిన జగనాసుర పాలన నుంచి విముక్తి లభించిందని ప్రజలు భావిస్తున్నారు. ఈ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో కనిపించేవి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లా అంతటా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.
- వారికి ప్రత్యేక ఆహ్వానం
చంద్రబాబునాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలానికి చెందిన నిద్రబంగి రామకృష్ణ, నిద్రబంగి ఆదినారాయణ, చిల్లా రామసూరి, నీలాపు సుందరరావు, సరగడ రమేష్ సైకిల్యాత్ర చేపట్టి శ్రీకాకుళం నుంచి తిరుపతికి బయలుదేరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు వీరు చేరుకోగానే.. అక్కడ వైసీపీ నాయకులు దుర్భాషలాడుతూ పసుపురంగు టీషర్టులను ఇప్పించి.. వారిని దారుణంగా అవమానించారు. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాన్ని వీడియోతీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. వైసీపీ అరాచకం రాష్ట్రమంతటా సంచలనమైంది. నేడు జరగనున్న ప్రమాణస్వీకార మహోత్సవానికి పుంగనూరు బాధితులైన రణస్థలానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. వారు ఇప్పటికే విజయవాడ వెళ్లారు.
- అచ్చెన్నకు మంత్రి పదవి ఖరారు.. వారితోపాటు మరొకరికి...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకి దాదాపు మంత్రి పదవి ఖరారైంది. అయితే ఏ శాఖ అన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అచ్చెన్నతోపాటు.. మరొకరికి అమాత్య పదవి లభించే అవకాశముంది. వారిలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందువరుసలో ఉన్నారు. అలాగే ఎన్టీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కూడా మంత్రి పదవి ఇవ్వొచ్చన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నేడు మధ్యాహ్నానికి స్పష్టత రానుంది.
- ఐదేళ్లు విసిగిపోయిన జనం... ఇప్పుడు సంబరం..
ఐదేళ్లపాటు వైసీపీ పాలనలో జనం విసిగిపోయారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను, ఒక ఎంపీ స్థానాన్ని టీడీపీ కూటమికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. 2019 నుంచి 2024 వరకు జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యం. కనీసం ప్రధాన రోడ్లను సైతం బాగుచేయలేదు. జనం కూడా బయటకు సమస్య చెబితే.. కేసుల భయంతో ఇన్నాళ్లు గడిపారు. ఉద్యోగులు కూడా వైసీపీ పాలనలో తమకు గౌరవం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుండడంతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- ప్రత్యక్ష ప్రసారం వీక్షణకు ఏర్పాటు
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ అధికారులు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూసేందుకు.. ఇచ్ఛాపురంలో రోటరీక్లబ్లోనూ, పలాసలో ఎమ్మెల్యే నివాసంలో, టెక్కలిలో ఆదిత్య కల్యాణమండపంలో, పాతపట్నంలో కేఎస్ఎం ప్లాజాలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అలాగే శ్రీకాకుళంలోని సింగుపురంలో గాయత్రీ కల్యాణ మండపంలోనూ, ఏడు రోడ్లజంక్షన్ లోని బాపూజీ కళామందిర్లోనూ, ఆమదాలవలసలో రైల్వేస్టేషన్ సమీపంలోనూ, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో కల్యాణి వెంకటేశ్వర వేదికలో, నరసన్నపేటలో జట్టుకళాశాల సంఘం యూనియన్ ఆఫీసులో ఎల్ఈడీ స్ర్కీన్లు, టీవీ సెట్లను అమర్చారు.
Updated Date - Jun 11 , 2024 | 11:33 PM