రైటర్లను మార్చేయండి
ABN, Publish Date - Mar 26 , 2024 | 01:22 AM
నగర పోలీస్ కమిషనరేట్ జోన్-2 పరిధిలోని స్టేషన్లలో రైటర్లను మార్చేయాలంటూ డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆదేశాలు జారీచేశారు.
జోన్-2 పరిధిలోని సీఐలకు డీసీపీ ఆదేశాలు
అవినీతి ఆరోపణలే కారణం
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ జోన్-2 పరిధిలోని స్టేషన్లలో రైటర్లను మార్చేయాలంటూ డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆదేశాలు జారీచేశారు. ఒకేసారి రైటర్లందరినీ మార్చేయాలంటూ సీఐలను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రైటర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోన్-2 పరిధిలో మూడు పోలీస్ సబ్డివిజన్లు, 11 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్టేషన్ల పరిధిలో పరిశ్రమలు, స్ర్కాప్ దుకాణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. స్టేషన్కు వచ్చే పిటిషన్ ఏదైనా ముందుగా రైటర్కి చేరిన తర్వాత సీఐ దృష్టికి తీసుకువెళతారు. సీఐ ఆదేశాలు మేరకు ఎస్ఐ లేదా ఏఎస్ఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తారు. ఈ ప్రక్రియలో స్టేషన్ రైటర్దే కీలకపాత్ర ఉంటుంది. దీని ఆసరాగా తీసుకుని కొంతమంది అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము వసూలు చేసిన దాంట్లో సీఐకి, ఎస్ఐలకు వాటాలు ఇస్తున్నారు. దీంతో సీఐలుగా ఎవరు వచ్చినాసరే రైటర్లు మాత్రం మారడం లేదు. దీంతో స్టేషన్లలో వారు చెప్పిందే వేదం అనే పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా గతంలో ఎన్నడూలేనివిధంగా ఒకేసారి అన్ని స్టేషన్ల రైటర్లను మార్చేయాల్సిందేనని ఆదేశాలు జారీచేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. రైటర్ల అవినీతిపై డీసీపీ-2కి చాలామంది ఫిర్యాదులు చేయడంతోనే మార్చేయాలని ఆయన ఆదేశాలు చేశారని చెబుతున్నారు.
Updated Date - Mar 26 , 2024 | 01:22 AM