పాడేరులో పండగ సందడి
ABN, Publish Date - May 20 , 2024 | 12:46 AM
ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ ఉత్సవాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చే నెలకు వాయిదా పడినప్పటికీ ఆదివారం మాత్రం పాడేరులో పండగ సందడి నెలకొంది. వాస్తవానికి ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండడంతో వారం, పది రోజుల కిత్రమే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానికుల బంధువులు ఇక్కడికి వచ్చారు. అలాగే వారి మొక్కులను సైతం తీర్చుకున్నారు.
- ఉత్సవాలు వాయిదా పడినా అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- వేసవి, ఉత్సవాల నేపథ్యంలో పాడేరులో కోలాహలం
పాడేరు, మే 19(ఆంధ్రజ్యోతి): ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ ఉత్సవాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వచ్చే నెలకు వాయిదా పడినప్పటికీ ఆదివారం మాత్రం పాడేరులో పండగ సందడి నెలకొంది. వాస్తవానికి ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానుండడంతో వారం, పది రోజుల కిత్రమే వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానికుల బంధువులు ఇక్కడికి వచ్చారు. అలాగే వారి మొక్కులను సైతం తీర్చుకున్నారు.
ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు భావిస్తాడు. దీంతో అధికారికంగా ఉత్సవాలు వాయిదా పడినప్పటికీ స్థానికంగా ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మోదకొండమ్మ దర్శనానికి ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయం లోపల నుంచి రోడ్డుపైకి సైతం భక్తులు వరుస కట్టారు. అలాగే మొక్కలున్న భక్తులు ఘటాలను అమ్మవారికి సమర్పించారు. దీంతో పాడేరు పట్టణంతో పాటు మోదకొండమ్మ ఆలయం ఆవరణలోనూ ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులకు ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిఽధులు ప్రత్యేకంగా ప్రసాదాలు పంపిణీ చేశారు.
కిటకిటలాడిన పట్టణ వీధులు
ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి చిరు వర్తకులు ఇప్పటికే పాడేరు చేరుకున్నారు. ఉత్సవాలు వాయిదా పడినప్పటికీ కొందరు ఇక్కడే ఉండిపోయి తమ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయా దుకాణాల్లో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. పట్టణం వీధుల్లో సైతం జనంతో పండగ హడావిడి నెలకొంది. ఎన్నికల కోడ్ అతిక్రమించకుండా, ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
Updated Date - May 20 , 2024 | 12:46 AM