భూమి కేటాయించాకే రైల్వే జోన్ పనులు
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:28 AM
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయదలచిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించాకే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.
బడ్జెట్లో తూర్పు కోస్తా రైల్వే జోన్కు రూ.10,586 కోట్లు
వాల్తేరు డివిజన్ కూడా అందులో భాగమే...
అమృత్ స్టేషన్ల కింద విశాఖపట్నం, దువ్వాడ, సింహాచలం, అనకాపల్లి, ఎలమంచిలి, అరకులోయ అభివృద్ధి
కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయదలచిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించాకే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. 2024-25కి సంబంధించిన రైల్వే బడ్జెట్పై ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడారు. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఈ బడ్జెట్లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉన్న ఒడిశా రాష్ట్రానికి రూ.10,586 కోట్లు కేటాయించారు. వాల్తేరు డివిజన్ కూడా అందులో భాగమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించామని, 100 శాతం రైల్వే ట్రాకులను విద్యుద్దీకరణ చేశామన్నారు. గత పదేళ్లలో ఏపీలో ఏడాదికి సగటున 151 కి.మీ. చొప్పున కొత్త ట్రాకుల నిర్మాణం చేపట్టామన్నారు. భద్రత కోసం అనేక ప్రాంతాలో అండర్ పాస్వేలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగిందన్నారు. ఏపీలో రూ.73,743 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. విశాఖపట్నం జిల్లా వరకు చూసుకుంటే విశాఖపట్నం, దువ్వాడ, సింహాచలం, అనకాపల్లి, ఎలమంచిలి, అరకు రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు.
Updated Date - Jul 25 , 2024 | 01:28 AM