సెజ్, పార్మా కార్మికుల పరిస్థితి దయనీయం
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:05 AM
సెజ్, పార్మా కర్మాగారాల్లో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.
అచ్యుతాపురం, సెప్టెంబరు 20: సెజ్, పార్మా కర్మాగారాల్లో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కార్మికులు, ప్రజల రక్షణకు సీపీఎం చేస్తున్న యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సెజ్లోని గార్మెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల జీవితాలు అత్యంత నికృష్టంగా ఉన్నాయన్నారు. తక్కువ జీతాలిచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. అలాగే పార్మా కర్మాగారాల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కాలుష్య కారక కర్మాగారాలు ఏర్పాటు చేసి కార్మికులతోపాటు ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాల్లో కారిడార్ల పేరుతో లక్షల ఎకరాలు సేకరిస్తున్నా వినియోగంలోకి తేవడం లేదన్నారు. కాకినాడలో పది వేల ఎకరాలు సేకరించి.. కేవలం 150 ఎకరాల్లో ఒక్క పరిశ్రమ మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక వేత్తలకే కొమ్ముకాస్తోందన్నారు. సమావేశంలో నాయకులు సీపీఎం నాయకులు లోకనాథం, బి.ప్రభావతి, ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, రొంగలి రాము, డి.వెంకన్న, కర్రి అప్పారావు, జి.దేముడు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 12:05 AM