దుర్గ్ వందేభారత్కు స్పందన అంతంతే..
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:59 AM
విశాఖపట్నం నుంచి దుర్గ్కు వేసిన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెద్దగా ఆదరణ లభించేలా లేదు.
నేడు 995 సీట్లు ఖాళీ
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి దుర్గ్కు వేసిన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్కు పెద్దగా ఆదరణ లభించేలా లేదు. ఈ నెల 18న లాంఛనంగా ఈ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. 20వ తేదీ నుంచి రెగ్యులర్గా వారానికి ఆరు రోజులు నడుస్తుందని ప్రకటించారు. ఆదివారం సెలవు. ఈ రైలులో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా అందులో 1,286 సీట్లు అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఇక్కడి నుంచి వెళ్లిన రైలులో మూడొంతుల రైలు ఖాళీగానే ఉంది. శనివారం విశాఖ నుంచి దుర్గ్కు వెళ్లే రైలు రిజర్వేషన్ వివరాలు చూస్తే...1,286 సీట్లకు గాను 995 సీట్లు ఖాళీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వారం అంతా రిజర్వేషన్ తీరు అదే విధంగా ఉంది. ఈ మార్గంలో వందే భారత్కు అంత డిమాండ్ లేకపోయినా రాయపూర్-విశాఖ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఒడిశా పెద్దలు ఈ రైలును వేయించుకున్నారు. నాలుగో వంతు ప్రయాణికులతో ఎన్నాళ్లు నడుపుతారో చూడాలి మరి.
5 నుంచి విశాఖ, అరకు మధ్య ప్రత్యేక రైలు
పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 5 నుంచి విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రవేశపెడుతున్నామని వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 08525 నంబరు గల రైలు వచ్చే నెల ఐదు నుంచి 15వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.30 గంటలకు అరకులోయ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08526 నంబరు గల రైలు అదే తేదీల్లో మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ చేరుతుంది.
Updated Date - Sep 21 , 2024 | 12:59 AM