ఎన్నికలకు సమాయత్తం
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:20 AM
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలోని 22 మండలాల్లో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ సూచనలతో 1,021 పోలింగ్ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ విజయసునీత ఆధ్వర్యంలో చేస్తున్నారు.
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
ఐటీడీఏ కార్యాలయంలో అరకులోయ ఆర్వో కార్యాలయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ర్టాంగ్ రూమ్, ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 7,61,255 మంది ఓటర్లు, 1,021 పోలింగ్ కేంద్రాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలోని 22 మండలాల్లో పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ సూచనలతో 1,021 పోలింగ్ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ విజయసునీత ఆధ్వర్యంలో చేస్తున్నారు.
డిగ్రీ కళాశాల ఆవరణలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్
జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచేందుకు స్ర్టాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలిస్తారు. పోలింగ్ అనంతరం వాటిని సేకరించి, ప్రత్యేక భద్రతతో ఇక్కడికే తీసుకువచ్చి, స్ర్టాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అలాగే ఎన్నికల కమిషన్ సూచనలతో కౌంటింగ్ సైతం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోనే నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయసునీత ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అలాగే పోలింగ్ ముందు రోజు ఎన్నికల సిబ్బందికి సామగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిణీ చేసేందుకు పాడేరులోని తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో, అరకులోయలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో, రంపచోడవరంలో స్థానిక ఆఽశ్రమ పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ అనంతరం స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్
ఎన్నికల నిర్వహణలో భాగంగా అప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ఇబ్బందులను అధిగమించేందుకు స్థానిక కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అందులో 16 విభాగాలకు సంబంచిన డెస్క్లను ఏర్పాటు చేసి, వాటిని పర్యవేక్షించేందుకు 19 మంది నోడల్ అధికారులను నియమించారు. మేన్పవర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, కంప్యూటరైజ్డ్, సైబర్, ఐటీ, లా అండ్ ఆర్డర్, ఈవీఎంలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల వ్యయం బ్యాలెట్ పేపర్, పోస్టర్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఓటర్ల జాబితాలు, ఫిర్యాదులు, ఓటర్స్ హెల్ప్లైన్, అబ్జర్వేషన్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులను ఏర్పాటు చేశారు.
ఐటీడీఏలో అరకులోయ ఆర్వో కార్యాలయం
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబఽంధించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పీవో అభిషేక్ ఆర్వోగా వ్యవహరించనున్నారు. ఈ నియోజకవర్గంలో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని 304 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2 లక్షల 41 వేల 360 మంది ఓటర్లున్నారు. అరకులోయ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చి తమ నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ వంటి ప్రక్రియలు జరుగుతాయి.
ఏర్పాటు కాని పాడేరు ఆర్వో కార్యాలయం
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్లోనే రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జాయింట్ కలెక్టర్ పాడేరు అసెంబ్లీ ఆర్వోగా వ్యవహరించనున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గం పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల పరిధిలో 318 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2 లక్షల 44 వేల 925 మంది ఓటర్లున్నారు. పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నామినేషన్ల సమర్పణ, ఉపసంహరణలకు స్థానిక ఐటీడీఏలోని ఆర్వో కార్యాలయానికి రావాల్సిందే.
Updated Date - Mar 26 , 2024 | 12:20 AM