జూట్ కార్మికుల కన్నెర్ర
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:44 PM
స్థానిక శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లు కార్మికులు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొబ్బిలి: స్థానిక శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లు కార్మికులు మంగళవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూట్ యాజమాన్యం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, నాయకులు, పోలీసుల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం పీఎఫ్ బకాయిలను చెల్లించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేస్తోందని కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఆదర్శ కార్మిక సంఘ అధ్యక్షుడు వి.శేషగిరారావు, చోడిగంజి రమేష్నాయుడు, పి.కృష్ణ, జి.రామారావు, భుజంగరావుల నాయకత్వంలో మిల్లు ఖాళీ స్థలంలో షెడ్లు నిర్మించి ఆక్రమించుకున్నారు. తమ బకాయిలు చెల్లించే వరకు షెడ్లు తొలగించేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మిల్లును పూర్తిగా మూసి వేసి, యంత్రాలను, ఇతర సామగ్రిని అమ్మేసి, రియల్ ఎస్టేట్గా మిల్లు స్థలాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. దీనితో కార్మికులంతా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. పీఎఫ్ బకాయిల కోసం ప్రజాప్రతినిధులను, జూట్ యాజమాన్యాన్ని, అధికారులను ఎన్ని సార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్య వైఖరిని తప్పుబడుతూ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Updated Date - Jun 11 , 2024 | 11:44 PM