పట్టణాలకు అమృత్ నిధులు
ABN, Publish Date - Jun 02 , 2024 | 12:36 AM
భీమవరం పట్టణానికి మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు, పైపులైన్ల ఏర్పాటుకు అమృత్–2లో రూ.47.29 కోట్లు మంజూర య్యాయి.
తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు, నరసాపురాలకి మంజూరు
భీమవరం టౌన్, మే 29 : భీమవరం పట్టణానికి మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు, పైపులైన్ల ఏర్పాటుకు అమృత్–2లో రూ.47.29 కోట్లు మంజూర య్యాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ప్రజారోగ్య శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. నివేదికలు రాగానే సాంకేతిక అనుమతుల కోసం ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఈ నిధులతో పట్టణంలోని మారుతీనగర్, బుధవారం మార్కెట్, హౌసింగ్ బోర్డు కాలనీ, వంశీకృష్ణనగర్లో రిజర్వాయర్లు నిర్మిస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పనులు వేగవంతంగా ప్రారంభించేలా చర్యలు ఉంటాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరాకు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన వచ్చినా అమలు కాలేదు. ఇప్పుడు మళ్లీ అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆకివీడు నగర పంచాయతీకి మంజూరైన రూ.28.60 కోట్లతో రిజర్వాయర్లు, పైపులైన్, పిల్టర్ బెడ్ల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాంకేతిక అనుమతి కోసం ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతులు రాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెంలో సమ్మర్ స్టోరేజ్ పనులకు టెండర్లు పూర్తవడంతో పనులు చేపట్టారు. భీమవరం గునుపూడి లే–అవుట్లో రూ.13.39 కోట్లతో పైపులైన్లు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తణుకుకు రూ.8.36 కోట్లు, నరసాపురానికి రూ.21 కోట్లు మంజూరయ్యాయి.
Updated Date - Jun 02 , 2024 | 12:36 AM