చేపల చెరువులో మునిగి అన్నాచెల్లెళ్ల దుర్మరణం
ABN, Publish Date - Jun 04 , 2024 | 12:45 AM
ముదినేపల్లి శివారు అన్నవరంలో సోమవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. చేపల చెరువు ఒడ్డున ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అన్నాచెల్లెళ్లు దుర్మరణం పాలయ్యారు.
ముదినేపల్లి, జూన్ 3 : ముదినేపల్లి శివారు అన్నవరంలో సోమవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. చేపల చెరువు ఒడ్డున ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అన్నాచెల్లెళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బట్టు సురేష్, రాణి దంపతుల కుమారుడు కుమార్ (7) వర్ణిక (4) ఇద్దరు కలిసి తమ ఇంటి వెనుక ఉన్న ఒక చేపల చెరువు ఒడ్డుకు సోమవారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్ళారు. కొంతసేపు ఆడుకున్న అనంతరం ఇద్దరు పిల్లలు కనిపించలేదు. సాయంత్రం 4 గంటలకు వర్ణిక చెరువులోని నీటిపై తేలుతూ కనిపించింది. అటుగా వెళుతున్న వారు చూసి చెరువులోని పాపను బయటకు తీశారు. కుమార్ కోసం నీటిలో వెదకగా అతను చెరువు అడుగు భాగంలో కన్పించాడు. ఇద్దరిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. కుమార్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుతుండగా వర్ణిక అంగన్వాడీ స్కూల్కు వెళ్తోంది. వేసవి సెలవులు కావడంతో ప్రతి రోజూ ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆడుకుని తిరిగి వచ్చేవారు. సోమవారం యథావిధిగా బయటకు వెళ్లిన పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదన చూపరులను కలచివేసింది.
Updated Date - Jun 04 , 2024 | 12:45 AM