టైరు పేలి.. ఆటోను ఢీకొన్న పెట్రోల్ ట్యాంకర్
ABN, Publish Date - May 19 , 2024 | 01:01 AM
పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలి ట్యాంకర్, ఆటో ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన నూజివీడు మండలం మీర్జాపురం వద్ద చోటుచేసుకుంది.
ఐదుగురికి తీవ్ర గాయాలు
ట్యాంకర్ బోల్తాతో లీకైన పెట్రోల్, డీజిల్
చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీస్ శాఖలు
ఊపిరి పీల్చుకున్న స్థానికులు
నూజివీడు టౌన్, మే 18: పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలి ట్యాంకర్, ఆటో ఢీకొనడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన నూజివీడు మండలం మీర్జాపురం వద్ద చోటుచేసుకుంది. నూజివీడు నుంచి ఏలూరు వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ మీర్జాపురం వద్ద ముందు భాగంలోని ఎడమ టైర్ పేలి పోవడంతో ట్యాంకర్ అదుపుతప్పి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వస్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విశాఖపట్నం గాంధీనగర్కు చెందిన కురందాస్ గోవింద్, కురందాస్ ఆదిలక్ష్మి, కురందాస్ రత్నం, అరసా ప్రసాద్తో పాటు తణుకు మండలం పైడిపర్రుకు చెందిన దూళ్ళ నాగపెద్దిరాజు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 108 సిబ్బంది క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలిం చి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కాగా పెట్రోల్ ట్యాంకర్, ఆటోను ఢీ కొన్న అనంతరం పల్టీ కొట్టడంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్, డీజిల్ లీకవడంతో సంఘటనా స్థలంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నూజివీడు అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ ఘటనా స్థలానికి చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - May 19 , 2024 | 01:01 AM