ప్లస్ టూ ఫెయిల్ !
ABN, Publish Date - Apr 14 , 2024 | 12:16 AM
ప్లస్ టూ పాఠశాలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఫస్టియర్ ఉత్తీర్ణతలో వెనుకబాటులే అనుకున్నా రెండో ఏడాది నిర్వహణ ప్రణాళిక లేకపోవడం కాస్తా విద్యార్థినులకు శాపంగా మారింది.
బోధనలో ప్రాధాన్యత లేదు.. సౌకర్యాలు అంతంతే..
విద్యార్థినుల వెనుకబాటుకు వైసీపీ ప్రభుత్వమే కారణం
ఫస్టియర్ 30 శాతం, సెకండియర్ 38 శాతం ఉత్తీర్ణత
విద్యార్థినుల తల్లిదండ్రుల్లో నిరుత్సాహం
భీమవరం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 13 : ప్లస్ టూ పాఠశాలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఫస్టియర్ ఉత్తీర్ణతలో వెనుకబాటులే అనుకున్నా రెండో ఏడాది నిర్వహణ ప్రణాళిక లేకపోవడం కాస్తా విద్యార్థినులకు శాపంగా మారింది. దీంతో గత ఏడాది ప్లస్ టూ బ్యాచ్తోపాటు ఈ ఏడాది బ్యాచ్ విద్యార్థినులు ఉత్తీర్ణతకు వైసీపీ ప్రభుత్వం కారణంగా నిలిచింది. 2022–23లో జిల్లాలో 16 ప్లస్ టూ పాఠశాలలను నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రత్యేకంగా బోధన సిబ్బంది నియమించలేదు. జడ్పీ హైస్కూల్ సిబ్బందినే ఉపయోగించడంతో విద్యార్థినుల ఉత్తీర్ణత గత ఏడాది ఫలితాలలో 16 శాతానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సప్లిమెంటరీ ఫలితాలు అయిన తర్వాత 20 శాతం ఉత్తీర్ణతగా నిలిచారు. 2023–24లో అధ్యాపకులను ఏర్పాటు చేసినా, పుస్తకాలు, విద్యా సామగ్రి వంటివి ద్వితీయ సంవత్సర విద్యార్థినులకు అందలేదు.
ప్రణాళిక లేకపోతే ఫలితమిదే
ప్లస్ టూ పాఠశాలల ఏర్పాటుపై వున్న శ్రద్ధ.. విద్యా బోధనలో చూపించకపోవడం, ప్రణాళిక లేకపోవడం విద్యార్థినుల భవిష్యత్ చదువులో వెనుకబడేలా చేసింది. ప్రభుత్వ పాఠశాల నుంచి ఏటా జిల్లా నుంచి ఆరు వేలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణతగా రావడం వారిలో విద్యార్థినులు మూడు వేలకుపైగా ఉన్నప్పటికి ప్లస్ టూ పాఠశాలల అమలు తీరు చూసి 2022–23లో 120 మంది విద్యార్థినులు, 2023–24లో 206 మంది విద్యార్థినులు చేరారు. ఈ ఏడాది వైసీపీ నాయకులు ప్లస్ టూలో చేరాలని ప్రచారం చేశారు. చేర్పించారు. చివరికి ఉత్తీర్ణతకు వచ్చేసరికి మొదటి ఏడాది విద్యార్థినులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ మూడు గ్రూపులు గాను 206 మంది విద్యార్థినులు 61 మంది ఉత్తీర్ణత సాధించి 145 మంది ఫెయిల్ అయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 120 మంది విద్యార్థినులకు 45 మంది ఉత్తీర్ణులైతే 75 మంది ఫెయిల్ అయ్యారు. ప్రథమ సంవత్సరంలో 30 శాతం ద్వితీయ సంవత్సరం 38 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టేశారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు నిరుత్సాహంగా ఉన్నారు.
Updated Date - Apr 14 , 2024 | 12:16 AM