ఉచిత ఇసుకకు గ్రహణం
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:28 AM
ఉచిత ఇసుక సరఫరాకు పట్టిన గ్రహణం వీడటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ ఉచిత ఇసుక పాలసీని నీలినీడలు కమ్ముతూనే ఉన్నాయి.
తొలి రోజు ఆన్లైన్ బుకింగ్ నిల్
బుకింగ్దారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
వెబ్సైట్ ఓపెన్ కాలేదంటూ సమాధానం
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
వినియోగదారులను వీడని ఇసుక కష్టాలు
ఆగిన ఎగుమతులు
పాలకొల్లు, సెప్టెంబరు 19: ఉచిత ఇసుక సరఫరాకు పట్టిన గ్రహణం వీడటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ ఉచిత ఇసుక పాలసీని నీలినీడలు కమ్ముతూనే ఉన్నాయి. గురువారం నుంచి ఇసుక వినయోగదారులు తమ సమీపంలోని సచివాలయాలలో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చని ప్రయత్నించారు. ఇసుక ఎగుమతిదారులు గురువారం ఉదయం 10గంటలు నుంచి సచివాలయాలు చూట్టూ ప్రదక్షిణలు చేయటమే కానీ ఫలితం దక్కలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అంతటా ఇదే పరిస్ధితి నెలకొనిఉంది. కొన్ని సచివాలయలలో మధ్యాహ్నం 12గంటలకు ప్రయత్నించినప్పటికీ ఇంకా ఉదయం 10గంటలు కాలేదని, మరికొంత సమయం నిరీక్షించాలని వెబ్సైట్లో కనిపించడం గమనార్హం. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉచిత ఇసుకకు ఆన్లైన్ బుకింగ్కి అనుమతులు రాలేదని సమగ్ర సైట్లో కనిపించినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా అంతటా ఇదే పరిస్ధితి కనబడగా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవడానికి ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాలేదని తెలుస్తుంది.
కూటమి అధికారం చేపట్టిన తొలినాళ్లలో పర్వతాలు మాదిరిగా ఉన్న ఇసుక నిల్వలను ఇసుకాసురులు కేవలం 10రోజుల్లో కొల్లగొట్టారు. అనంతరం ఇసుకను స్టాక్ పాయింట్లకు చేరవేయడానికి అయిన ఖర్చులను వెచ్చించి ఆమేరకు వినియోగారులు చెల్లించాలని విధానాన్ని రూపొందించారు. సమగ్ర విధానాలు అమలు కాకముందే తూర్పు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు మూడు స్టాక్ పాయింట్లు మినహా మిగిలిని చోట్ల ఇసుక ఖాళీ అయ్యింది. గత 10రోజులుగా పెండ్యాల, పందలపర్రు, ర్యాంపులలో ఇసుక ఎగుమతులు జరిగాయి. ఇక్కడా అవినీతి రాజ్యమేలింది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ 10రోజులుగా ఇసుక ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. 5యూనిట్లు ధర రూ.25వేలు ధర పలికింది.
ఓపెన్ కాని వెబ్సైట్
ఇసుక ఎగుమతులలో పారదర్శకత నెలకొల్పడానికి ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని 19వ తేదీన అమలులోకి తెచ్చారు. అయితే సాంకేతిక ఇబ్బందులతో తొలిరోజు వెబ్సైట్ ఓపెన్ కాలేదు. ఈకారణంగా ఆన్లైన్ ఇసుక బుకింగ్ పక్రియకు అంతరాయం కల్గింది. ఒకవైపు స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు అయ్యిపోయాయి. మరోవైపు గోదావరికి పూర్తిస్థాయిలో వరద తగ్గలేదు. రెండు మూడు పడవల ర్యాంపులలో ఇసుక సేకరిస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలోని పెద్దతరహా, 8 ఓపెన్ రీచ్లలో ఇసుక తవ్వకాలు మొదలైతేనే కష్టాలు గట్టుక్కెతాయని చెబుతున్నారు. అక్టోబరు నెలాఖారునాటికి ప్రధాన రీచ్లలో బాటలు వేస్తే కొంతమేర ఇసుక కష్టాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టిప్పర్లారీ యూనియన్ నాయకులు బుధవారం పశ్చిమ జాయింట్ కలెక్టర్తో భేటీ కాగా గురువారం తూర్పుగోదావరి జిల్లా జాయింట్కలెక్టరుతో యూనియన్ నాయకులు సమావేశం అయ్యారు. ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమై, పూర్తిస్థాయిలో బుకింగ్లు మొదలైనప్పటికీ తమ డిమాండ్లను నెరవేర్చలేదని జేసీ దృష్టికి యూనియన్ నాయకులు తీసుకెళ్ళారు.
Updated Date - Sep 20 , 2024 | 12:28 AM