లోకేశ్ చొరవతో ఎడారి చెర వీడింది
ABN, Publish Date - Jul 27 , 2024 | 03:19 AM
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పనిచేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఓ ప్రవాసాంధ్రుడు మంత్రి నారా లోకేశ్ చొరవ, అరబ్బు తెగ ల ప్రయత్నంతో ఎట్టకేలకు శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
స్వదేశానికి మరో ప్రవాసాంధ్రుడు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పనిచేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఓ ప్రవాసాంధ్రుడు మంత్రి నారా లోకేశ్ చొరవ, అరబ్బు తెగ ల ప్రయత్నంతో ఎట్టకేలకు శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సారెళ్ల వీరేంద్రకుమార్ కొన్నాళ్ల క్రితం ఒక సంపన్న అరబ్బు కుటుంబానికి చెందిన ఫాంహౌ్సలో వంటమనిషిగా పనిచేయడానికి ఖతర్ వచ్చాడు. అయితే ఆ యజమాని అతన్ని పొరుగున ఉన్న సౌదీ అరేబియాలోని ఎడారికి తీసుకొచ్చి ఒంటెల క్షేత్రంలో పని అప్పగించాడు. ఎడారిలో, మండుటెండలో ఒంటెల కాపరిగా జీవనం సాగించడం వీరేంద్రకుమార్కు కష్టమైంది. దీంతో ఎడారిలో ఒంటెల మధ్యన తాను ఎదుర్కొంటున్న కష్టాలను వీరేంద్రకుమార్ సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ తనను స్వదేశానికి రప్పించాలని వేడుకున్నాడు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి రావడంతో ఆయన వీరేంద్రకుమార్కు సా యం చేయాలని తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణకు సూచించారు. తెలుగుదేశం ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి ఈ విషయమై ఇటు పార్టీ వర్గాలు అ టు అధికార వర్గాలతోనూ చర్చించారు. ఉపాధి ఒప్పందంపై వచ్చిన వీరేంద్రకుమార్కు గడువుకు ముందే వీసా రద్దు అంశం, సౌదీ అరేబియా, ఖతర్ దేశాల మధ్య ఉన్న వీసా నియమాలు అవరోధంగా మారాయి. దీంతో రాధాకృష్ణ సౌదీ అరేబియాలోని నారియా అనే ఎడారి అరబ్బు తెగల ప్రముఖుల సహాయం కోరగా, వారు ఖతర్లోని అదే తెగ వారితో సంప్రదించి వీరేంద్రకుమార్ను వెనక్కి పంపించాలని కోరారు. దీనికి వారు అంగికరించడంతో వీరేంద్రకుమార్ భారత్కు తిరిగిరావడానికి మార్గం సుగమమైంది. సౌదీ అరేబియాలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా.. ఖతర్ సరిహద్దులోని నారియా ఎడారి నుంచి వీరేంద్రకుమార్ను తీసుకురావడంతో పాటు హైదరాబాద్ వరకు విమానం టికెట్ను సమకూర్చారు.
Updated Date - Jul 27 , 2024 | 07:11 AM