బీచ్ శాండ్ మైనింగ్... అదానీకి గేట్లు బార్లా!
ABN , Publish Date - Feb 23 , 2024 | 01:43 AM
రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సముద్రతీరంలోని అత్యంత విలువైన బీచ్ శాండ్ మైనింగ్ను కార్పొరేట్ దిగ్గజం ఆదానీ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించడం దారుణం....

రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సముద్రతీరంలోని అత్యంత విలువైన బీచ్ శాండ్ మైనింగ్ను కార్పొరేట్ దిగ్గజం ఆదానీ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించడం దారుణం. టైటానియమ్ డై ఆక్సైడ్, ఇల్మినైట్, రూటైల్, గార్నెట్, సిలిమనైట్, లూకోజిన్ వంటి అరుదైన మూలకాలు బీచ్ శాండ్లో ఉంటాయి. పెయింట్లు, రంగుల పరిశ్రమలో ఉపయోగించే టైటానియం డయాక్సైడ్ వీటిలో చాలా ముఖ్యమైనది. ఇవి అణుధార్మిక స్వభావాన్ని కలిగివుండేవి, దేశ భద్రతకు కూడా కీలకమైనవి. ఆ కారణంగానే ఆఫ్షోర్ మినరల్ మైనింగ్లో ప్రైవేటు రంగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో చట్ట సవరణ చేసింది. కాని, అదే మోదీ సర్కారు నాలుగేళ్లు తిరగ్గానే యూ టర్న్ తీసుకుని మైనింగ్కు ప్రైవేటు రంగాన్ని అనుమతించాలంటూ 2023 మే 25న ముసాయిదా విడుదల చేయడం, చకచకా చట్ట సవరణకు బిల్లు ప్రతిపాదించడం వెనుక బడా కార్పొరేట్ల సేవ తప్ప వేరే ప్రయోజనమేదీ లేదు. ప్రతిపక్ష సభ్యులంతా మణిపూర్ దారుణాలపై చర్చ జరగాలని పట్టుబడుతున్న సమయంలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ సేవా తత్పరతకు నిదర్శనం.
కార్పొరేట్లు అందునా అదానీ ఆదేశాలను కేంద్రం ఎంతలా శిరసావహిస్తోందో అర్థం చేసుకోవడానికి ఈ చట్ట సవరణ తతంగం ఓ మచ్చుతునక. బీచ్ శాండ్ మైనింగ్ కోసం రెండు సంస్థలను (ఒకటి ఏపీలో ‘అలువైల్’ పేరుతో, మరొకటి ఒడిషాలో ‘పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్’ పేరుతో) ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది ఏప్రిల్ 14, 27 తేదీల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజికి అదానీ గ్రూపు లేఖ రాసిన నెల రోజులకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ముసాయిదా విడుదల చేయడం గమనార్హం. అంతేగాక బీచ్ శాండ్ నిర్వచనాన్ని మార్చడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఖనిజాలను ‘అణు మూలకాల’ జాబితా నుంచి తొలగించడానికి కసరత్తు చేస్తోంది. ఆఫ్షోర్ మైనింగ్ పరిధిలోకి 12 రకాల ఖనిజాలను తీసుకురావడంతో పాటు గతంలో ఉన్న నాలుగేళ్ల గడువును 50 సంవత్సరాలకు పెంచి లీజుకు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదించడం కార్పొరేట్లకు సాష్టాంగపడడమే!
మైన్స్ అండ్ మినరల్స్ చట్టం ఖనిజాలను ఎ–బి–సి అనే మూడు రకాలుగా విభజిస్తోంది. పార్ట్–బిలో ఆటమిక్ మినరల్స్ ఉంటాయి. తాజాగా మోదీ ప్రభుత్వం పార్ట్–బి నుంచి కొన్ని ఖనిజాలతో డి గ్రూపును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ‘క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ గ్రూపులో మొత్తం ఎనిమిది ఖనిజాలూ అదానీ గ్రూపు ఆసక్తి చూపినవే కావడం మరో నిదర్శనం. ఆఫ్షోర్ మైనింగ్ చట్ట సవరణలు రాష్ట్రాల హక్కులను తీవ్రంగా దెబ్బ తీస్తాయి. దేశ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇటువంటి బిల్లులను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. గతంలో మన రాష్ట్రానికి అటువంటి గొప్ప చరిత్ర ఉంది. కాని, వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లుకు మద్దతు తెలపడం మన రాష్ట్ర ప్రయోజనాలకు హానికరం.
సాధారణ పారిశ్రామికవేత్తలు కలిస్తేనే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ వచ్చేస్తోందన్నట్టు ప్రకటనలు జారీ చేసే సీఎం కార్యాలయం... గత సంవత్సరం గౌతమ్ అదానీ ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయిన సంగతి మాట మాత్రంగానైనా వెల్లడించకపోవడంపై అప్పుడే పలు అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్రంలోని బీచ్ శాండ్ మైన్స్లో ‘ప్రాజెక్టు డెవలపర్ కమ్ ఆపరేటర్’ పేరిట 92 శాతం వాటాను ఆఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు కూడా పిలిచింది.
ఏపీలో చోటుచేసుకోబోతున్న మరో భారీ దోపిడీకి హైకోర్టు చెక్పెట్టింది. ప్రభుత్వ పెద్దలకు అస్మదీయుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి బీచ్శాండ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి సంకల్పించిన వ్యూహాన్ని న్యాయస్థానం ప్రస్తుతానికి అడ్డుకుంది. బీచ్శాండ్ టెండర్ల ఖరారును నిలిపివేస్తూ హైకోర్టు జనవరి 10న ఉత్తర్వులు ఇచ్చింది. ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన బీచ్శాండ్ మినరల్స్ తవ్వకం పనులను అదానీకి దొడ్డిదారిన కట్టబెట్టే జగన్ ప్రభుత్వ పథకం బట్టబయలైంది.
ఇప్పటికే రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అదానీ పరమైనాయి. విశాఖ నగరంలో విలువైన స్థలాలను ఐటి అభివృద్ధి పేరిట అప్పగించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ అంటూ రాయలసీమ జిల్లాల్లోను, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. బీచ్ శాండ్ మైనింగ్తో బంగాళాఖాతం తీరం నుంచి తూర్పు కనుమల వరకు అదానీ సామ్రాజ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గేట్లు బార్లా తెరిచాయి. బీచ్శాండ్ మైనింగ్ వల్ల సముద్ర పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఈ కారణంగానే బీచ్శాండ్ మైనింగ్ ఇంతకాలం ప్రభుత్వ అధీనంలోనే కొనసాగింది. ఇప్పుడు చట్టాలను మార్చి అదానీ చేతుల్లో పెట్టబోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలను జనం ప్రతిఘటించాలి. ప్రజల సంపదను ప్రజలే కాపాడుకోవాలి.
ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సిపిఐ ఎంఎల్ నాయకులు