టైరుకు నిప్పంటుకుని.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN, Publish Date - May 20 , 2024 | 04:19 AM
టైరుకు నిప్పంటుకుని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. బెంగళూరు నుంచి భీమవరం వెళ్తుండగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
బెంగళూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఘటన
రేణిగుంట, మే 19: టైరుకు నిప్పంటుకుని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. బెంగళూరు నుంచి భీమవరం వెళ్తుండగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి రమణయ్య కథనం మేరకు.. శనివారం రాత్రి బెంగళూరు నుంచి భీమవరానికి 12 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున తిరుపతి సమీప వెదుళ్లచెరువు వద్ద టైరుకు నిప్పంటుకుంది. పక్కన వెళుతున్న మరో వాహన డ్రైవర్ గుర్తించి బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో వెంటనే రోడ్డుపక్కన బస్సును నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దింపేశారు. ఈ లోపు మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా కాలిపోవడంతో రూ.40లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని రమణయ్య తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో దానికి సంబంధించిన ఏదేని వస్తువు టైరుకు గుచ్చుకొని.. రాపిడికి మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
Updated Date - May 20 , 2024 | 04:19 AM