బెంగాల్లో ఎన్ఐఏ వాహనంపై దాడి
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:19 AM
పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
అర్ధరాత్రి సమయంలో ఎందుకెళ్లారు?: మమత
కోల్కతా, ఏప్రిల్ 6: పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. భూపతినగర్ ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు ప్రయాణిస్తున్న వాహనంపై గ్రామస్తులు శనివారం దాడి చేశారు. 2022 బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఎన్ఐఏ బృందం తిరిగి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు రాళ్లు రవ్వడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయని, ఒక అధికారి గాయపడినట్లు ఎన్ఐఏ బృందం ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. 2022 డిసెంబరు 3న భూపతినగర్లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందారు. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించారు. కాగా, ఉత్తర 24పరగణాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణానికి సంబంధించి సోదాల కోసం వెళ్లిన ఈడీ అధికారులపై కూడా ఈ ఏడాది జనవరి 5న ఇలాగే దాడి జరిగింది. దాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ఎన్ఐఏ అధికారులు సోదాల కోసం అర్ధరాత్రి సమయంలో ఎందుకెళ్లారు? దీనికోసం వారు పోలీసుల అనుమతి తీసుకున్నారా?’ అని నిలదీశారు. బీజేపీకి మద్దతుగా ఎన్ఐఏ వ్యవహరిస్తోందని ఆరోపించారు. భూపతినగర్ వాసులపై తొలుత దాడిచేసింది ఎన్ఐఏ అధికారులేనని చెప్పారు. తమపై దాడి చేస్తుంటే మహిళలు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలని మమత విజ్ఞప్తి చేశారు.
Updated Date - Apr 07 , 2024 | 03:19 AM