BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే చక్కెర ఫ్యాక్టరీ మూసివేత
ABN, Publish Date - Jan 28 , 2024 | 01:27 PM
విజయపుర బీజేపీ సీనియర్నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(MLA Basanagowda Patil Yatnal)కు చెందిన సిద్దసిరి చక్కెర ఫ్యాక్టరీని మూసివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది.
- కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): విజయపుర బీజేపీ సీనియర్నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(MLA Basanagowda Patil Yatnal)కు చెందిన సిద్దసిరి చక్కెర ఫ్యాక్టరీని మూసివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. కలబురగి జిల్లా చించోళి తాలూకా చిమ్మాయిదలాయి గ్రామ పరిధిలో సిద్దసిరి చక్కెర ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత నీరు ముల్లామురి జలాశయానికి విడుదల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గాలి, నీరు కలుషిత చట్టం ఉల్లంఘించారనే ఆరోపణల మేరకు ఫాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. అదే తరహాలోనే ఫ్యాక్టరీకి నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని మండలి ఆదేశించింది. హుమ్నాబాద్ పట్టణ పరిధిలో ప్రసన్న ప్రీ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇటీవల విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఇదే సందర్భంలోనే హుమ్నాబాద్ ఫ్యాక్టరీతో పాటు చించోళి తాలూకాలోని యత్నాళ్కు చెందిన సిద్దసిరి సౌహార్ధ సహకార చక్కెర ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీశాఖ మంత్రి ఈశ్వర్ఖండ్రే నేతృత్వంలో జరిగిన సభలో రెండు ఫ్యాక్టరీలను మూసివేయాలని తీర్మానించారు. అందుకు అనుగుణంగానే ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా బీజేపీ ఫైర్బ్రాండ్గా పేరొంది నిత్యం కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడే యత్నాళ్ను కట్టడి చేసే కుట్రలో భాగంగానే చక్కెర ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారని విజయపుర జిల్లా బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండే పదుల చక్కెర ఫ్యాక్టరీల నుంచి వెలువడే నీరు బయటకు వచ్చినట్లే ఇక్కడా జరుగుతోందని, రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ఖండ్రే స్పందిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రూ.1.5 కోట్ల జరిమానా విధించిందని శనివారం కలబురగిలో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పలు ఫ్యాక్టరీలకు కాలుష్య నియంత్రణమండలి నోటీసులు జారీ చేసిందన్నారు. యత్నాళ్పై ఎటువంటి రాజకీయ కుట్రలేదని, నిబంధనల ప్రకారమే నోటీసులు జారీచేశామని వివరణ ఇచ్చారు. ఆదేశాలను పాటించి ఫ్యాక్టరీను మూసివేయకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Updated Date - Jan 28 , 2024 | 01:27 PM