భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు!
ABN, Publish Date - Aug 29 , 2024 | 05:52 AM
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు దేశంలోని జనాభా పెరుగుదల రేటును కూడా దాటేసిందని తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ఆధారంగా ఐసీ3 స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను రూపొందించింది. పోలీసు
భారీగా పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు!
జనాభా పెరుగుదల రేటునూ దాటేసిన వైనం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడులో అత్యధికం
యువకుల్లో కంటే యువతుల్లోనే ఎక్కువ
మానసిక ఒత్తిడి తదితర కారణాలు.. కౌన్సెలింగ్తో నివారణ
న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా భారీగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు దేశంలోని జనాభా పెరుగుదల రేటును కూడా దాటేసిందని తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ఆధారంగా ఐసీ3 స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను రూపొందించింది. పోలీసు రికార్డులకు ఎక్కని ఆత్మహత్యలు కూడా కలిపితే ఈ రేటు మరింత ఆందోళనకరస్థాయిలో ఉంటుందని నివేదిక పేర్కొంది. ‘స్టూడెంట్స్ సూసైడ్స్: యాన్ ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా’ పేరిట రూపొందించిన ఈ నివేదికను బుధవారం యాన్యువల్ ఐసీ3 కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో-2024లో విడుదల చేశారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్య ఏటా రెండు శాతం పెరిగిపోతుండగా, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 4 శాతం పెరిగిపోతోందని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లోనే విద్యార్థుల వార్షిక ఆత్మహత్యల రేటు 4 శాతానికి పెరిగిందని వెల్లడించింది. ‘గత దశాబ్ద కాలంలో దేశంలో 0 నుంచి 24 ఏళ్లలోపు జనాభా 58.2 కోట్ల నుంచి 58.1 కోట్లకు తగ్గిపోయింది. అదే సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044కి పెరిగిపోయింది’ అని తెలిపింది. గత దశాబ్ద కాలంలో పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 61 శాతం పెరిగిపోయాయని పేర్కొంది.
2022 సంవత్సరంలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల్లో 53% పురుష విద్యార్థులు ఉన్నారని వివరించింది. అలాగే, 2021-2022 మధ్య పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, విద్యార్థినుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగిపోయాయని పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్నాయని, దేశంలో మూడో వంతు ఆత్మహత్యలు ఈ మూడు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తెలిపింది. కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన కోటా ప్రాంతం ఉన్న రాజస్థాన్లో విద్యార్థులు అత్యధిక ఒత్తిడి కి గురవుతున్నారని, దీంతో విద్యార్థుల ఆత్మహత్యల్లో ఆ రాష్ట్రం 10వ స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. మానసిక ఒత్తిళ్లు తదితర కారణాలతోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మన విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్య సవాళ్లను పరిష్కరించాల్సిన అత్యవసర స్థితిని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోందని ఐసీ3 వ్యవస్థాపకుడు గణేశ్ వ్యాఖ్యానించారు. కౌన్సెలింగ్ సదుపాయాలను పెంచాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోందన్నారు.
Updated Date - Aug 29 , 2024 | 05:52 AM