క్యాన్సర్ పేషంట్లకు ఉచిత హెల్ప్లైన్ నెంబర్
ABN, Publish Date - Mar 27 , 2024 | 01:56 AM
క్యాన్సర్ పేషంట్లకు ఫోన్లో ఉచితంగా వైద్య సేవలు అందించటానికి వీలుగా కొందరు ఆంకాలజిస్టులు (క్యాన్సర్ వైద్యులు) ‘క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్’ పేరుతో హెల్ప్లైన్ నెంబరును ఏర్పాటు చేశారు.
‘సెకండ్ ఒపీనియన్’ కోసం ప్రారంభించిన ఆంకాలజిస్టులు
అందుబాటులో సీనియర్ వైద్యుల సేవలు
న్యూఢిల్లీ, మార్చి 26: క్యాన్సర్ పేషంట్లకు ఫోన్లో ఉచితంగా వైద్య సేవలు అందించటానికి వీలుగా కొందరు ఆంకాలజిస్టులు (క్యాన్సర్ వైద్యులు) ‘క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్’ పేరుతో హెల్ప్లైన్ నెంబరును ఏర్పాటు చేశారు. 93555 20202 నెంబరుపై ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇది ముఖ్యంగా సెకండ్ ఒపీనియన్ (క్యాన్సర్ నిర్ధారణపై ఒక డాక్టర్పైనే ఆధారపడకుండా.. మరో డాక్టర్ అభిప్రాయం కూడా తీసుకోవటం) కోసం పేషంట్లకు ఉపయోగపడుతుందని క్యాంపెయిన్ సారథి డాక్టర్ అశీష్ గుప్తా వెల్లడించారు. ‘క్యాన్సర్ జీవన్మరణ సమస్య కాబట్టి.. దాని బారిన పడినవారందరికీ సెకండ్ ఒపీనియన్ను సిఫార్సు చేస్తారు. చికిత్స సమయంలో కూడా పేషంట్లకు పలు సందేహాలు వస్తుంటాయి. క్యాన్సర్ చికిత్స వ్యయమూ అధికమే. ఈ నేపథ్యంలోనే, ఎటువంటి ఆర్థికభారం లేకుండా ఉచితంగా సీనియర్ ఆంకాలజిస్టుల సేవలను ఈ హెల్ప్లైన్ ద్వారా అందిస్తున్నాం’ అని తెలిపారు. క్యాన్సర్ చికిత్స రోజురోజుకీ మెరుగుపడుతోందని, అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని.. సెకండ్ ఒపీనియన్ హెల్ప్లైన్ ద్వారా వీటి గురించి విలువైన సమాచారం పేషంట్లకు అందుబాటులో ఉంటుందన్నారు.
Updated Date - Mar 27 , 2024 | 01:56 AM