ఫైనాన్స్ ఏజెంట్ల దాష్టికానికి యువకుడి బలి
ABN, Publish Date - Apr 06 , 2024 | 03:48 AM
ఫైనాన్స్ ఏజెంట్ల రాక్షసత్వానికి ఖమ్మం నగరంలో ఓ యువకుడు బలైపోయాడు. బైక్ లోన్ తీసుకొని వాయిదాల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో ఫైనాన్స్ ఇచ్చిన ఏజెంట్లు యువకుడిపై దాడికి దిగారు. అతడు ప్రాణభయంతో పారిపోతుండగా రాళ్లు పట్టుకొని వెంబడించారు.
మృతుడు యూపీకి చెందిన వినయ్.. ఖమ్మంలో ఘటన
ఈఎంఐ చెల్లించలేదని దాడి.. వెంబడించిన ఏజెంట్లు
భయంతో చెరువులో దూకిన వినయ్.. ఈత రాక మృతి
ఖమ్మం క్రైం, ఏప్రిల్ 5: ఫైనాన్స్ ఏజెంట్ల రాక్షసత్వానికి ఖమ్మం నగరంలో ఓ యువకుడు బలైపోయాడు. బైక్ లోన్ తీసుకొని వాయిదాల చెల్లింపుల్లో జాప్యం చేయడంతో ఫైనాన్స్ ఇచ్చిన ఏజెంట్లు యువకుడిపై దాడికి దిగారు. అతడు ప్రాణభయంతో పారిపోతుండగా రాళ్లు పట్టుకొని వెంబడించారు. దీంతో యువకుడు ఎటూ తప్పించుకోలేక ఓ చెరువులో దూకాడు. ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్ నుంచి మార్బుల్ పని కోసం వచ్చిన వినయ్(20)గా గుర్తించారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రాకు చెందిన వినయ్(20), అతడి స్నే హితుడు అజయ్ మార్బుల్ పనుల కోసం కొంతకాలం క్రితం ఖమ్మం వచ్చారు. నగర పరిధిలోని దానవాయిగూడెంలో నివాసం ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం నగరంలోని మోహన్ సాయి సెకండ్ హ్యాండ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రెండు బైక్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి కొద్దినెలలు ఈఎంఐలు చెల్లించారు. వినయ్ రూ.4,500, అజయ్ రూ.14,500 చెల్లించాల్సి ఉంది. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లయిన అజయ్కుమార్, రాంచందర్ శుక్రవారం దానవాయిగూడేనికి వెళ్లారు. అజయ్ కొద్దిరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లడంతో.. అతడి బైక్ ఎక్కడుందని వినయ్ను అడిగారు. బల్లేపల్లిలోని ఒకరికి అజయ్ అప్పు ఉన్నాడని, అతను బైక్ను తీసుకువెళ్లాడని వినయ్ తెలిపాడు. వెంటనే వినయ్ను తీసుకుని ఏజెంట్లు బల్లేపల్లికి వెళ్లారు. అక్కడ గొడవ జరిగింది. ఈ క్రమంలో రాంచందర్ కర్రతో వినయ్ను కొట్టాడు. వినయ్ భయంతో పారిపోతుండగా రికవరీ ఏజెంట్లు వెంబడించారు. భయంతో వినయ్ చెరువులో దూకాడు.ఈత రాకపోవడంతో చనిపోయాడు. విష యం తెలిసిన ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. రికవరీ ఏజెంట్లు అజయ్ కు మార్, రాంచందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Updated Date - Apr 06 , 2024 | 03:48 AM