ఈసీదే తుది నిర్ణయం: కొండా పిటిషన్పై హైకోర్టు
ABN, Publish Date - May 03 , 2024 | 04:46 AM
బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్లు మార్చేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్
బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్లు మార్చేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాలెట్ పేపర్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు కిందే అదే పేరు కలిగిన మరో అభ్యర్థి పేరు ఉంది. తనకు, తనలాంటి పేరే కలిగిన అభ్యర్థికి మధ్య కనీసం పది నంబర్లు తేడా ఉండేలా ఈసీని ఆదేశించాలని ఆయన కోరారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ దరఖాస్తుపై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం బ్యాలెట్ పేపర్లో మార్పుల విషయంలో ఈసీదే తుది నిర్ణయమని పేర్కొంటూ విచారణను ముగించింది.
Updated Date - May 03 , 2024 | 08:16 AM