మహిళా హక్కుల సాధనకు ఉద్యమించాలి
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:32 AM
మహిళా హక్కులసాధనకోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.
భగత్నగర్, జూలై 26: మహిళా హక్కులసాధనకోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్లో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలను విస్మరించారన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని, నిర్భయ, అత్రాస్, మణిపూర్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లను బీజేపీ ఎంపీ లైంగికంగా వేధించారని, బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిందితుకు అండగా ఉండడం సిగ్గు చేటన్నారు. నిత్యావసర సరుకులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అభినందనీయమన్నారు. గ్యాస్ సబ్సిడీ కొద్ది మందికి మాత్రమే అందుతుందన్నారు. గృహజ్యోతి ద్వారా అర్హులైన వారందరికి ఉచిత కరెంటు ఇవ్వాలని, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి జెండాను అవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు కెఎన్ ఆశాలత, మాచర్ల భారతి, నాగలక్ష్మి, శశికళ, అనుమల మహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ద్యావ అన్నపూర్ణ, రోజారాణి, దేవేంద్ర పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 12:32 AM