సన్నాల కొనుగోళ్లు ప్రశ్నార్థకం
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:20 AM
వానాకాలం ధాన్యం సేకరణపై రైతులకు నిరీక్షణ తప్పేటట్టు లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు మొదలువగా ఇతర మరికొంత సమయం పట్టనుంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌరసర పరాల, మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ, తూనికలు, కొలతలు, ఐకేపీ, మెప్మా తదితర శాఖలు సన్నద్ధం కాగా...రైతులు సైతం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు.
- ముందే మిల్లర్ల మెలిక
- సన్నరకం గానుగాడించేందుకు ససేమిరా
- సీఎంఆర్ ఔట్టర్న్పై స్పష్టత కరువు
- రైస్ మిల్లర్లతో సివిల్ సప్లయ్ శాఖ సంప్రదింపులు
- కొనుగోళ్లకు రంగం సిద్దం చేసిన అధికారులు
- జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
జగిత్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ధాన్యం సేకరణపై రైతులకు నిరీక్షణ తప్పేటట్టు లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు మొదలువగా ఇతర మరికొంత సమయం పట్టనుంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌరసర పరాల, మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ, తూనికలు, కొలతలు, ఐకేపీ, మెప్మా తదితర శాఖలు సన్నద్ధం కాగా...రైతులు సైతం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ఈ వానాకాలం సీజన్లో కొందరు రైతులు సన్న రకం వరి పంటను సాగు చేశారు. ఎప్పటిలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైస్మిల్లులకు తరలించేందుకు పౌరసరపరాల సంస్థ సన్నాహాలు చేస్తుండగా సీఎంఆర్ శాతం 67 నుంచి 58కి తగ్గిస్తేనే ధాన్యం దించుకుంటామని రైస్మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముందే అవాంతరాలు ఏర్పడుతున్నాయి.
421ఽ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా 421 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో 133 కేంద్రాలు ఇందిరాక్రాంతి పథం మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయనుండగా, 277 కేంద్రాలు సహకార శాఖ ద్వారా, ఒకటి మెప్మా ఆద్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గానూ 1.43 లక్షల గన్నీ బ్యాగులు అవసరము ఉండగా, ప్రస్తుతం జిల్లాలో 23 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 1.20 లక్షల గన్నీ బ్యాగులను కొనుగోలు చేయడానికి పౌరసరఫరా శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మిల్లర్ల మెలికతో సంశయాలు
జిల్లాలో ఈ వానాకాలంలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు దిగుబడిని అంచనా వేసి నిర్ణీత ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు జిల్లాల్లో దశల వారీగా...కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు ఏర్పాటు జరుగుతున్న తరుణంలో క్వింటాకు 67 శాతం బియ్యం ఇవ్వలేమని రైస్మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. మిల్లింగ్ నిబంధనలు సడలించి క్వింటాకు కొంత పరిహారం, కస్టోడియన్, మిల్లింగ్ రవణా చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కానిదే ధాన్యాన్ని మిల్లింగ్కు తీసుకోమని రా రైస్, పారాబాయిల్డ్ రైస్మిల్లుల సంక్షేమ సంఘం జిల్లాల కమిటీలు స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని తమ రాష్ట్ర సంఘం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతుండగా మిల్లర్ల మెలికతో సన్నధాన్యం సేకరణ చిక్కు సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో దాన్యం సేకరణ ఎలా సాధ్యమనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
సన్నరకాలపై మిల్లర్ల పేచీ
సీఎంఆర్ దొడ్డు రకాలపై వచ్చే తరహాలో 67 శాతం ఔట్ టర్న్ రాదని సన్నరకంపై రైస్మిల్లర్లు పేచి పెడుతున్నారు. సన్న రకం ధాన్యం ఔట్టర్న్ 58 శాతం మాత్రమే వస్తుందని, ఆమేరకు తగ్గించాలని, లేకుంటే క్వింటా ధాన్యానికి రూ. 300 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల సంఘం నాయకులు విఙ్ఞప్తి చేశారు. ధాన్యం నిల్వల తరుగుదలపై ఒక శాతం డ్రైయేజ్ చార్జీలతో పాటు, రైస్మిల్లులో ధాన్యం నిల్వచేసినందుకు ప్రతినెలా క్వింటా ధాన్యానికి రూ. 2.40 చొప్పున ప్రతి సీజన్కు రెండుసార్లు కస్టొడియన్ చార్జీలతోపాటు పలు డిమాండ్లు తెరమీదకు తెస్తున్నారు. బియ్యం రవాణా, బ్లెండింగ్ చార్జీలతో పాటు గత ఆరేళ్లుగా బకాయి ఉన్న సీఎంఆర్ చార్జీలు చెల్లించాలని కోరుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పౌరసరఫరాల అధికారులు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ తరలింపు సజావుగా సాగేందుకు రైస్మిల్లర్ల సంఘలతో సంప్రదింపులు చేస్తున్నారు.
Updated Date - Oct 24 , 2024 | 01:20 AM