కాకతీయ కాలువ నుంచి నీటి విడుదల నిలిపివేత
ABN, Publish Date - Apr 01 , 2024 | 12:26 AM
కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను ఆదివారం అధికారులు నిలిపివేశారు.
తిమ్మాపూర్, మార్చి 31: కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను ఆదివారం అధికారులు నిలిపివేశారు. ముందస్తు ప్రణాళిక, తాగునీరు ఎద్దడి దృష్ట్యా కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిడ్ మానేరు నుంచి 1.20టిఎంసీ నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాగునీటి అవసరాలకు 6.20 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, వాటిని వృథా చేయకుండా వాడుకుంటేనే నీటి ఎద్దడిని అదిగమించవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని తాగు నీటి అవసరాల కోసం మొదటి ప్రాధాన్యంగా వినియోగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తాగు నీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన నీటిని ప్రాజెక్టులో నిల్వ వుంచమని ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
Updated Date - Apr 01 , 2024 | 12:26 AM