50 వేల మెజారిటీ ఇవ్వాలి
ABN, Publish Date - Apr 08 , 2024 | 11:39 PM
మహబూబ్నగర్ పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొడంగల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో 50 వేల మెజార్టీ తగ్గకుండా ఆధిక్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపు
వికారాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్నగర్ పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొడంగల్ నుంచి లోక్సభ ఎన్నికల్లో 50 వేల మెజార్టీ తగ్గకుండా ఆధిక్యత ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని కొడంగల్లోని తన నివాసంలో పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, పార్టీ పరిశీలకుడు సంపత్కుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డితో కలిసి సీఎం సోమవారం సమీక్ష చేశారు. నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలు, రెండు మునిసిపాలిటీల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన సమీక్ష రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది. అనంతరం ఆయన తన నివాసానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొడంగల్లో కాంగ్రెస్ను ఓడించి, రేవంత్రెడ్డిని కింద పడేయాలని కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెరచాటున చేస్తున్న ఆ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డిని ఎందుకు కింద పడేయాలనే కుట్ర జరుగుతున్నదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇదంతా రేవంత్రెడ్డిని దెబ్బతీయడం కాదని కొడంగల్ అభివృద్ధినే దెబ్బతీయడమేనని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంపై జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మరో రేవంత్రెడ్డిగా మారి పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగల్లేనని స్పష్టం చేశారు. తనతో కొట్లాడే హక్కు.. తనతో పట్టుపట్టి పని చేయించుకునే అధికారం మీకున్నదని ఆయన ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. వంద రోజుల్లో కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ జూనియర్, డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నామని, వందల కోట్ల రూపాయలతో తండాలకు రోడ్లు మంజూరు చేసుకున్నామని, రూ.4,000 కోట్లతో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకున్నామనే ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు అరుణమ్మ కొడంగల్ను అభివృద్ధి చేయనీయకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, టీపీసీసీ ప్రతినిధి ఎండీ. యూసూప్ ఆయా మండలాలు, మునిసిపాలిటీల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Apr 08 , 2024 | 11:39 PM