మిగిలిన ధాన్యాన్ని సేకరించాలి
ABN, Publish Date - May 22 , 2024 | 11:09 PM
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి శ్రుతి ఓఝా అన్నారు.
- మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలి
- జిల్లా ప్రత్యేకాధికారి శ్రుతి ఓఝా
గద్వాల, మే 22 : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి శ్రుతి ఓఝా అన్నారు. గద్వాల మండల పరిధిలోని లత్తిపురం, బీరెల్లి కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, ఎన్ని రాజోల్లో కాంటా చేస్తున్నారు, ధాన్యం ఎప్పుడు తరలిస్తున్నారు, ఎన్ని రోజులకు రైతులు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు సానుకూలంగానే సమాధానం చెప్పారు. జిల్లాలో 70 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 10 కేంద్రాల్లో ధాన్యం సేకరణ కొనసాగుతోందని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం కొన్న వెంటనే ట్యాబ్లలో నమోదు చేసి, లారీల్లో రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ. కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు లేవని, రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చూస్తున్నామని వివరించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ అధికారి విమల, ఏఈవో కోటేశ్వరి పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2024 | 11:20 PM