నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
ABN, Publish Date - May 25 , 2024 | 11:27 PM
వానాకాలం సాగుకోసం విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం రైతు అవగాహన సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్
అక్కన్నపేట/హుస్నాబాద్, మే 25: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ హెచ్చరించారు. మండలంలోని జనగామ రైతు వేదికలో శనివారం విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఫర్టిలైజర్, సీడ్స్ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. వానాకాలం సాగు కోసం ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలని, విత్తనాల ప్యాకెట్లకు లేబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నారు. ఇందులో ఏడీఏ మహేష్, ఏఈవో శ్రీలత, తదితరులు ఉన్నారు. రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలో విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తన డీలర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లు రశీదు తీసుకోవాలని సూచించారు.
Updated Date - May 25 , 2024 | 11:27 PM