కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం..
ABN, Publish Date - Mar 27 , 2024 | 11:43 PM
బెజ్జంకి, మార్చి 27: నీరు లేక పంటలు ఎండిపోవడం లేదని, నీరు ఎక్కడ ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని.. అసలు కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్
బెజ్జంకి, మార్చి 27: నీరు లేక పంటలు ఎండిపోవడం లేదని, నీరు ఎక్కడ ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని.. అసలు కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిడ్ మానేరు నుంచి 02 టీఎంసీల నీటిని అన్నపూర్ణ (అనంతగిరి) ప్రాజెక్టులో వదిలి బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లోని చెరువులు, కుంటలు నింపితే రైతులు కోట్లాది రూపాయాల పంట పండించుకునేవారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నింపడంతో బోరు బావుల్లో నీరు ఉండి మోటార్లతో పంటలకు నీరు పారించుకున్నామని రైతులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టి ఒక కాఫర్ డ్యాం కట్టి నీటిని ఎత్తిపోస్తే ఎల్ఎండీ, మిడ్ మానేరు నిండేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకపోవడంతో రైతులు తీసుకున్న రుణాలను కట్టాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పై బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల అధికారులు గ్రామాల్లోకి రాకుండా, రుణాలు కట్టాలని రైతులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయామని ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని రైతులు చెబుతున్న పుస్తెల తాళ్లు అమ్మి అయిన సరే రుణాలు కట్టాలని బ్యాంకు అధికారులు వేధించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుదని రైతులు అదైర్యపడవద్దని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Mar 27 , 2024 | 11:43 PM