మెడికిల్' షాపులు!
ABN, Publish Date - Mar 27 , 2024 | 11:51 PM
జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా నకిలీ మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హోల్సెల్ డ్రగ్ వ్యాపారులు.. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ధనార్జనే ధేయ్యంగా నిబంధనలకు తిలోదకాలిస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వైద్యుడి చీటి(ప్రిిస్క్రప్షన్) లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. మెడికల్ దుకాణాలపై ఔషధనియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మారింది.
జిల్లాలో జోరుగా నకిలీ మందుల విక్రయాలు!
జిల్లాలో 380 మెడికల్ షాపులు
ప్రిస్కిప్షన్ లేకున్నా అమ్మకాలు
జనరిక్ మందులకు... బ్రాండెడ్ ధరలు వసూలు
నిఘా కరువు.. యథేచ్ఛగా దందా!
సంఘం గుప్పిట్లో డ్రగ్స్ అధికారులు
తూతూమంత్రంగా పర్యవేక్షణ
జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇచ్చి అడ్డగోలుగా మందులు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా నకిలీ మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హోల్సెల్ డ్రగ్ వ్యాపారులు.. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ధనార్జనే ధేయ్యంగా నిబంధనలకు తిలోదకాలిస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వైద్యుడి చీటి(ప్రిిస్క్రప్షన్) లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. మెడికల్ దుకాణాలపై ఔషధనియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మారింది.
పరిగి, మార్చి 27 : కొందరు జ్వరం వచ్చిందనో...జలుబు చేసిందనో డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే నేరుగా మెడికల్దుకాణానికి వెళుతుంటారు. డాక్టర్ దగ్గరికి వెళితే రూ.100 నుంచి రూ.300వరకూ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. స్పెషలిస్టు డాక్టర్ అయితే రూ. 500 వరకూ ఫీజు తీసుకుంటున్నాడు. అంత ఫీజులు చెల్లించలేని పేదప్రజలు ఏదైనా మెడికల్ షాపునకు వెళ్లి అడిగితే ఓ గోలి లేదా టానిక్ ఇచ్చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్లలా సలహాలు ఇచ్చి మందులు అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో రూపాయో.. ఐదు రూపాయాలో డాక్టర్ ఫీజులు తీసుకునే రోజులు పోయాయి. అయితే మెడికల్ షాపుల వాళ్లు ఇచ్చే మందులు అన్ని సరైనవేనా.. నకిలీలు ఉన్నాయా ఆంశాన్ని ఆలోచిస్తే మంచిది.! ఎందుకంటారా? జిల్లాలోని మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా నకిలీ మందుల దందా సాగుతోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హోల్సెల్ డ్రగ్ వ్యాపారులు.. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ధనార్జనే ధేయ్యంగా నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ తమ వ్యాపారాలను సాగిస్తున్నారు. హోల్సెల్ వ్యాపారులైతే మరింత బరితెగించి రిటైల్ దుకాణాలకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోల్సెల్ వ్యాపారులు మెడికల్ దుకాణాలకు ఇచ్చే ప్రతీ డ్రగ్పై బ్యాచ్ నంబరు ఉంటుంది. ఇలా రిటైల్ దుకాణాలకు ఇచ్చే సమయంలో బిల్లుపై పొందుపరిచిన బ్యాచ్ నంబర్, కొనుగోలుదాడికి ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబరు కూడా ఒకే విధంగా ఉంటేనే సరైనవేనని నమ్మొచ్చు. కానీ రెండు బిల్లులపై వేర్వేరు నంబర్లు ఉండడంతో నకిలీ మందుల దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
నియంత్రణ కరువు...
వైద్యం పేరుతో వ్యాపారం చేసే కొన్ని కొన్ని హోల్సెల్ ఏజెన్సీలతోపాటు, మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. జిల్లాలో 380 వరకు మెడికల్ దుకాణాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో లైసెన్స్లు లేని దుకాణాలు కూడా వందకుపైగా ఉంటాయని అంచనా. అయితే ఎన్ని షాపులకు అనుమతి ఉంది. ఎవరు నిబంధనలు అతిక్రమిస్తూ మందులు విక్రయిస్తున్నారనే విషయంపై తనిఖీలు లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది. అయితే ప్రస్తుతం మందుల షాపుల యజమానులు మాత్రం జనరిక్ ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారు. బ్రాండెడ్ మందులు విక్రయిస్తే రిటైర్లకు సుమారు 18 నుంచి 20 శాతం లాభాలు వస్తుండగా, వాటి పేరుతో జనరిక్ మందులు అమ్మితే 70నుంచి 200ల శాతం లాభాలు గడిస్తున్నారు. జనరిక్, బ్రాండెడ్ మందుల నాణ్యతలో ఏలాంటి వ్యత్యాసం లేదని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నప్పటీకీ వైద్యులు జనరిక్ సిఫార్సు చేయడం లేదు. ఒకే రకమైన మందుల్ని తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు జనరిక్పై ఒక ధర, బ్రాండెడ్ మందులపై మరో ధర ముద్రిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రెండు ధరలను ముద్రిస్తుండడంతో గందరగోళం నెలకొంది. దీంతో రెండు రకాల ముందులు ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు ఓ కంపెనీ తయారు చేసిన పెంటోప్రోజోల్ పది మాత్రలకు బ్రాండెడ్ కంపెనీలో రూ.120లకు లభిస్తుండగా, జనరిక్లో రూ.20లకే లభ్యమవుతాయి.
నిబంధనలు గాలికి...
వైద్యుడి చీటి(ప్రిస్ర్కిప్షన్) లేకుండా ముందుకు విక్రయించొద్దనే నిబంధనను మెడికల్ షాపుల యజమానులు తుంగలో తొక్కుతున్నారు. నిరక్షరాస్యులు, గిరిజనులు, వృద్ధులు అవసరాలను ఆసరాగా చేసుకుని మెడికల్ దుకాణాల నిర్వాహకులు చీటి ఉన్నా, లేకున్నా అధిక మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. కొందరు వ్యాపారులు ధనర్జనే థ్యేయంగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు సిబ్బంది కొరత పేరిట తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ షాపును నిర్వహించే ఫార్మాసిస్టు డ్రెస్కోడ్తో పాటు.. మందులు అందించే సమయంలో గ్లౌజులు వేసుకోవాలి. కొన్ని మందులను ఫ్రిజ్లో మాత్రమే భద్రపరచాలి. వైద్యుడి చీటి(ప్రిస్కిప్షన్) లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. వినియోగదారుడికి కచ్చితంగా మందుల వివరాలతో కూడిన బిల్లును ఇవ్వాలి. కానీ ఏదో ఒకటి రెండు మెడికల్ షాపుల్లో తప్పా మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదనేది నగ్నసత్యం. పేదలకు అందుబాటులోకి రావాల్సిన జనరిక్ మందులను అధికారులు ఎందుకు ప్రోత్సహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధరల్లో చాలా వ్యత్యాసం
ప్రొటీన్ పౌడర్ బ్రాండెడ్ రూ.150కి లభిస్తుండగా, జనరిక్లో రూ.25లకు లభిస్తుంది. ఎన్జైమ్ సిరప్ రూ.60లకు లభిస్తే, జనరిక్లో రూ.25లకు, ట్యాబ్లెట్ ఎసినిజ్ప్లస్ బ్రాండెడ్లో రూ.50లకు లభిస్తుండగా, జనరిక్ షాపుల్లో రూ.10లకు లభిస్తుండడం గమనార్హం. అయితే జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ప్రాంతాల్లో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయని కారణంగా రోగులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందుల ఏర్పాటు చేస్తే రోగులకు ప్రయోజనం కలగనుంది.
===========================================================
Updated Date - Mar 27 , 2024 | 11:51 PM