నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
ABN, Publish Date - Jun 04 , 2024 | 11:11 PM
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రం లో బుధవారం ప్రారంభం కానుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
రెండు రోజులకుపైనే లెక్కింపు కొనసాగే అవకాశం?
నల్లగొండ, జూన్ 4 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రం లో బుధవారం ప్రారంభం కానుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలిం గ్ జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాములో ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. బ్యాలెట్ అన్నింటిని బండిల్స్గా కట్టి అనంతరం లెక్కిస్తారు. మధ్యా హ్నం వరకు బండిల్స్ కట్టే అవకాశాలు ఉంటాయి. భోజన విరామం తరువాత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడుతారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈ ఓట్లను బ్యాలెట్ బాక్సుల వారీగా తీసుకువచ్చి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్గా కడతారు. బండిల్స్ కట్టడానికే సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం పడుతుందని సమాచారం. మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్ సూపర్వైజర్లతో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్వోలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేయనున్నారు.
Updated Date - Jun 04 , 2024 | 11:11 PM