Manchiryāla- హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 26 , 2024 | 10:49 PM
కోటపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వసతి గృహం విద్యార్థులతో కలిసి వసతి గృహం ఎదుట శుక్రవారం బీజేపీ నాయకులు ఽధర్నా చేపట్టారు.
కోటపల్లి, జూలై 26 : కోటపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వసతి గృహం విద్యార్థులతో కలిసి వసతి గృహం ఎదుట శుక్రవారం బీజేపీ నాయకులు ఽధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వసతి గృహం భవనం 50 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్పారు. ప్రస్తుతం శిథిలమైపోవడం, వర్షానికి గదుల్లో నీరు చేరుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంబంధిత అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వసతి గృహంలో ఆరు గదులు మాత్రమే ఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు చేరుతుందన్నారు. ఎప్పుడు వసతి గృహం కూలుతుందోననే భయం నెలకొందని విద్యార్థులు తెలిపారు. మరో వైపు మరుగుదొడ్లు, స్నానపు గదులు సైతం సరిపోవడం లేదని చెప్పారు. శిథిలమైన వసతి గృహాన్ని తొలగించి కొత్త వసతి గృహం నిర్మించాలని కోరారు. సుమారు 200 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటుండగా గదుల సౌకర్యం లేకపోవడంతో అవస్థల పాలవుతున్నారన్నారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు తహసీల్దార్ మహేందర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, నాయకులు గోనె మోహన్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 10:49 PM