పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:54 PM
ఓ ప్రేమజంట కరన్కోట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ మేజర్ గ్రామానికి చెందిన యువకుడు, పరిగి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఇద్దరూ మేజర్లు.
తాండూరు రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రేమజంట కరన్కోట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ మేజర్ గ్రామానికి చెందిన యువకుడు, పరిగి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఇద్దరూ మేజర్లు. గత రెండేళ్ల కిందట హైదరాబాద్లో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమై విషయాన్ని పెద్దలకు చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని మంగళవారం కరన్కోట్ పోలీసు స్టేషన్కు వచ్చారు. ఇరువర్గాల కుటుంబ సభ్యులను ఎస్ఐ విఠల్రెడ్డి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టప్రకారం వారి వివాహం చెల్లుతుందని అన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు ఏమైనా జరిగితే ఇరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాళ్లమీద పడ్డా కనికరించలేదు
కరన్కోట్ పోలీసుస్టేషన్కు ప్రేమపెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయిని చూసి కుటుంబసభ్యులు, బంధువులు విలపిం చారు. ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవవని, మన ఇంటికి వెళ్లిపోదామంటూ కుటుంబసభ్యులు అమ్మాయి కాళ్లమీద పడ్డారు. అయినా ఆ అమ్మాయి కనికరించలేదు. 20ఏళ్లు పెంచిన తమను వదిలి రెండేళ్లు ప్రేమించిన వ్యక్తి కావాలనుకుంటుందంటూ బోరున విలపిస్తూ వెళ్లిపోయారు.
Updated Date - Oct 23 , 2024 | 06:57 AM