ఘనంగా నృసింహస్వామి కల్యాణం
ABN, Publish Date - May 22 , 2024 | 11:25 PM
శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ నర్సింగ్ మందిర్ దేవాలయంలో బుధవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంత్యుత్సవాలు, కల్యాణం ఘనంగా నిర్వహించారు.
పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ప్రత్యేక పూజలు
శంషాబాద్, మే 22 : శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ నర్సింగ్ మందిర్ దేవాలయంలో బుధవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి జయంత్యుత్సవాలు, కల్యాణం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్షగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ ఆర్.గణేశ్గుప్తాలులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్ వై.కుమార్, నాయకులు దూడల వెంకటేశ్గౌడ్, సిమెంట్ శ్రీకాంత్, కృష్ణ, వివేకతో పాటు మున్సిపాలిటీలోని వివిధ బస్తీలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా చెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
కందుకూరు : మండంలోని ఉట్లపల్లి దేవునిగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు తేరటి లక్ష్మణ్ముదిరాజ్ ఆధ్వర్యంలో వేదపండితులు రేవెళ్ల రాజుశర్మ నేతృత్వంలో ఈనెల 25వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. బుధవారం ఉదయం మహాగణపతి పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అనంతరం, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచగవ్య ప్రాశణంతో పాటు అఖండ దీపారాధనం, ధ్వజారోహణం, దేవతాహ్వానం, మండప పూజలు, అంకురారోపణం, అగ్నిప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో హోమం, యజ్ఞాలు చేపట్టి భక్తులకు తీర్ధప్రసాదాలు వితరణ చేశారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామివారి తిరుకల్యాణోత్సవాన్ని జరిపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అన్నిరకాల సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ముదిరాజ్ తెలిపారు.
అభయాంజనేస్వామి ఆలయ వార్షికోత్సవం
ఆమనగల్లు, మే 22 : పట్టణంలోని గంగభవాని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం 9వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు విశాల వసతులు ఏర్పాటు చేశారు. పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్ రాధమ్మవెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు కొనసాగాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ ఎంగళి బాలకృష్ణ, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పరమేశ్, భీమనపల్లి సత్తయ్య, కోశాధికారి సాయికుమార్, సభ్యులు మురళి, ప్రసాద్, బాలింగం, ఎంగళి రమేశ్, తదితరులున్నారు. కాగా, అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పట్టణానికి చెందిన ఎంగళి రాఘవేందర్ శ్రీదీప్తి దంపతులు రూ.15,116 విరాళం ప్రకటించారు. ఆలయ ఆవరణలో నిర్వాహకులకు విరాళం అందజేశారు. రాఘవేందర్దీప్తి దంపతులను ఆలయ మర్యాదలతో సత్కరించి అభినందించారు.
Updated Date - May 22 , 2024 | 11:25 PM