గ్రంథాలయం.. శిథిలం
ABN, Publish Date - Oct 23 , 2024 | 11:49 PM
జ్ఞానాన్ని అందించే గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతో పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఇలాగే ఉంటున్నా పట్టించుకనే నాథుడే కరువయ్యాడు. ఆహ్లాదకర వాతావరణం లేకుండా.. అరకొర సౌకర్యాల మధ్య చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రంథాలయ నిర్వహణ కొనసాగుతోంది.
వానొస్తే తడుస్తున్న పుస్తకాలు
పాఠకులకు కనీస వసతులు కరువు
పట్టించుకోని ఉన్నతాధికారులు, పాలకులు
చేవెళ్లలో కొత్త భవన నిర్మాణానికి డిమాండ్
చేవెళ్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జ్ఞానాన్ని అందించే గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతో పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ఇలాగే ఉంటున్నా పట్టించుకనే నాథుడే కరువయ్యాడు. ఆహ్లాదకర వాతావరణం లేకుండా.. అరకొర సౌకర్యాల మధ్య చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రంథాలయ నిర్వహణ కొనసాగుతోంది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టించుకోని పరిస్థితి నెలకొంది. భవనానికి సరిపడా ఖాళీస్థలం ఉన్నా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఇది వరకు పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భవనం నిర్మాణం కోసం రూ.5 లక్షల వరకు మంజూరు చేసింది. అయినా భవనం నిర్మించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో నిధులు వాపస్ వెళ్లిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాస్థాయి అధికారులు, పాలకులు స్పందించి గ్రంథాలయ భవన నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠకులు కోరుతున్నారు.
తడిసిపోతున్న పుస్తకాలు
పాత భవనం కావడంతో వర్షం వస్తే విలువైన పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయి. ఒక గదిలోని ర్యాకుల్లో పుస్తకాలు, మిగిలిన చిన్న గదిలో పాఠకులు కూర్చుంటున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుంతోందనని పాఠకులు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. విజ్ఞాన భాండాగారాలుగా పిలుచుకునే గ్రంథాలయంలో నిత్యం అందుబాటులో ఉండాల్సిన గ్రంథపాలకుడి పోస్టు గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. దీంతో కేవలం అటెండర్తోనే నిర్వహణ కొనసాగిస్తున్నట్లు పాఠకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో లైబ్రేరియన్ పోస్టును సైతం భర్తీ చేయాలని స్థానిక పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు లేవు
ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గ్రంథాలయ భవనాకి నిధులు మంజూరు చేయకపోవడం దారుణం. వర్షం వస్తే కూర్చోవడానికి కూడా ఉండదు. పుస్తకాలన్నీ తడిసిపోయి చదవడానికి పనికిరాకుండా పోతున్నాయి. పాఠకులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ప్రభుత్వం తక్షణమే లైబ్రేరియన్ పోస్టును భర్తీ చేయాలి
-వై. కృష్ణ, పాఠకుడు, చేవెళ్ల
Updated Date - Oct 23 , 2024 | 11:49 PM