82.59 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:30 PM
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొత్తం 82.59 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటివరకు 28.69లక్షల మొక్కలు నాటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.
- అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
ఇబ్రహీంపట్నం, జూలై 26: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొత్తం 82.59 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటివరకు 28.69లక్షల మొక్కలు నాటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిధి చెర్లపటేల్గూడలోని పార్కు స్థలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతతో కలిసి మొక్కలు నాటారు. వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో జిల్లాస్థాయి అధికారి నుండి పంచాయతీ అధికారి వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 6వేల మొక్కలకు తగ్గకుండా నాటాలని ఆమె ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీ స్థలాలతోపాటు రోడ్లకు ఇరువైపులా, రైతుల పొలం గట్ల వెంట మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఇంటికి 5-6 మొక్కలు నాటాలని ఇంటి ముందు, పెరట్ల్లో ఈ మొక్కలు నాటుకోవాలన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి భావితరాల జీవన ప్రమాణాలు పెంచేందుకు అడవుల పెంపకం తప్పనిసరని ఆమె అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సక్రియానాయక్, ఎంపీడీవో వెంకటమ్మ, ఏపీవో తిరుపాచారి, ఈసీ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 11:30 PM