యూపీ రాజకీయాల్లో ప్రత్యేకత చాటుతా

ABN , First Publish Date - 2021-07-06T08:10:15+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుతానని సూర్యాపేట జిల్లావాసి శ్రీకళారెడ్డి స్పష్టం చేశారు. యూపీలోని జన్పూర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ఇటీవల..

యూపీ రాజకీయాల్లో ప్రత్యేకత చాటుతా

సూర్యాపేట జిల్లావాసి శ్రీకళారెడ్డి స్పష్టీకరణ

జన్పూర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక 


సూర్యాపేట, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుతానని సూర్యాపేట జిల్లావాసి శ్రీకళారెడ్డి స్పష్టం చేశారు. యూపీలోని జన్పూర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ఇటీవల ఎన్నికయ్యారు. ఆదివారం ఆ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఠాగూర్‌ వంశస్థులైన తన భర్త ధనుంజయ్‌సింగ్‌, మామ రాజ్‌దేవ్‌సింగ్‌లకు యూపీలో మంచి పలుకుబడి ఉందని ఆమె తెలిపారు. జన్పూర్‌ జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా, తమ మంచితనంతోనే అక్కడి ప్రజలు ఆదరించారన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా జిల్లా అభివృద్ధికే మొదటి ప్రాధాన్యమిస్తానని, అన్ని గ్రామాల్లో తాగునీటి అవసరాలు, పాఠశాలలు, విద్యుత్‌, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం రత్నవరం గ్రామం శ్రీకళారెడ్డి స్వస్థలం. హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీకళ, ఇంటిరీయర్‌ డిజైనర్‌గా పలు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో.. ధనుంజయ్‌సింగ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆమె మామ రాజ్‌దేవ్‌సింగ్‌, యూపీలోని రారి నియోజకవర్గం నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీకళ భర్త ధనుంజయ్‌సింగ్‌, మల్హాని నియోజకవర్గం నుంచి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఎ్‌సపీ నుంచి సైతం ఆయన ఎంపీగా పనిచేశారు.

Updated Date - 2021-07-06T08:10:15+05:30 IST