గల్ఫ్లో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
ABN , First Publish Date - 2021-08-23T08:30:53+05:30 IST
కరోనా ప్రభావంతో పండుగల నిర్వహణ తీరే మారిపోయింది. గతంలో బంధుమిత్రుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించుకునే పండుగలు కాస్తా..

ఆన్లైన్ సూచనలతో శాస్త్రోక్తంగా నిర్వహించుకున్న తెలుగు మహిళలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): కరోనా ప్రభావంతో పండుగల నిర్వహణ తీరే మారిపోయింది. గతంలో బంధుమిత్రుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించుకునే పండుగలు కాస్తా.. ఇప్పుడు ఆన్లైన్లోకి మారిపోయాయి. పండుగలు నిర్వహించే విధానం మారినా.. ఆధ్యాత్మిక భావన మాత్రం అసలు మారలేదని గల్ఫ్లో జరిగిన వరలక్ష్మీ వ్రతం నిరూపించింది. కరోనా నేపథ్యంలో.. అక్కడున్న తెలుగు వారు ఆన్లైన్ సూచనలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఎన్నడూ లేనంతటి స్థాయిలో భక్తి శ్రద్ధలతో ఈసారి వ్రతం నిర్వహించారు. కువైత్, దుబాయ్, మస్కట్ నగరాల్లోని తెలుగు కుటుంబాలు.. శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆన్లైన్ సూచనలతో జరుపుకొన్నారు. కరోనా వేళ.. ఎవరూ ఇతరుల్ని ఇళ్లకు పిలిచే సాహసం చేయలేకపోయారు.
దుబాయ్లోని ప్రవాసీ మహిళ వందితా రమేశ్.. ఆన్లైన్లో ఇస్తున్న సూచనలను పాటిస్తూ.. ఎవరికి వారు తమ ఇళ్లలో వ్రతం నిర్వహించుకున్నారు. వందిత.. ఆన్లైన్లోనే నవతరానికి వ్రతం వైశిష్ట్యాన్ని తెలియజేశారు. పూజా విధానాన్ని వివరించారు. కువైత్లో తెలుగు కళా సమితి అధ్వర్యంలో జరిగిన వ్రతంలో తెలుగు కుటుంబాలు భారీగా పాల్గొన్నాయి. ఆన్లైన్లో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామని ప్రవాసాంధ్ర సామాజిక కార్యకర్త జ్యోత్స్న కిషోర్ తెలిపారు. కొవిడ్ కారణంగా అతిథుల్ని ఇంటికి పిల్చుకోలేక పోయినా.. వ్రతం మాత్రం భక్తి శ్రద్ధలతో సంతృప్తికరంగా నిర్వహించుకున్నామని గల్ఫ్లోని తెలుగు కుటుంబాల వారు పేర్కొన్నారు.