‘ఎర్ర’ స్మగ్లర్లను తరలిస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు సీజ్
ABN , First Publish Date - 2022-02-11T07:03:49+05:30 IST
ఎర్రచందనం స్మగ్లర్లను తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును పోలీసులు సీజ్ చేశారు.

పోలీసుల అదుపులో ఇద్దరు ప్రధాన స్మగ్లర్లు, డ్రైవర్, కండక్టర్
చంద్రగిరి, ఫిబ్రవరి 10: ఎర్రచందనం స్మగ్లర్లను తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును తిరుపతి అర్బన్ స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు ప్రధాన స్మగ్లర్లతోపాటు డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి స్పెషల్ పార్టీ ఆర్ఎ్సఐ వాసు ఆధ్వర్యంలో చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలో కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పనపాకం రైల్వేస్టేషన్ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి నుంచి తిరుపత్తూరుకు వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఎక్కించినట్లు ఆర్ఎ్సఐకి సమాచారం అందింది. దాంతో తన బృందం, హైవే మొబైల్ పార్టీ సిబ్బందితో కలిసి పాకాలవారిపల్లె టోల్ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఉన్న సుమారు 45 మంది ఎర్రచందనం స్మగ్లర్లు వీరిని గమనించారు. వెంటనే బస్సు దిగి సమీప అడవుల్లోకి పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించారు. ఇద్దరు ప్రధాన స్మగ్లర్లతోపాటు బస్సు డ్రైవర్, కండక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో తనిఖీ చేయగా.. స్మగ్లర్లకు చెందిన బ్యాగులు, సంచులు, దుస్తులు కనిపించాయి. అనంతరం బస్సును సీజ్ చేసి, చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.