కఠారి దంపతుల హత్య కేసులో సాక్షుల విచారణ మొదలు

ABN , First Publish Date - 2023-02-18T00:50:33+05:30 IST

దివంగత మాజీ మేయర్‌ కఠారి దంపతుల హత్య కేసులో సాక్షుల విచారణ మొదలైంది. ప్రధాన సాక్షిగా ఉన్న సతీ్‌షను శుక్రవారం ఆరవ అదనపు జిల్లా కోర్టులో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.

కఠారి దంపతుల హత్య కేసులో సాక్షుల విచారణ మొదలు
చింటూను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు

చిత్తూరు లీగల్‌, ఫిబ్రవరి 17: దివంగత మాజీ మేయర్‌ కఠారి దంపతుల హత్య కేసులో సాక్షుల విచారణ మొదలైంది. ప్రధాన సాక్షిగా ఉన్న సతీ్‌షను శుక్రవారం ఆరవ అదనపు జిల్లా కోర్టులో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. 2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కఠారి అనురాధ, కఠారి మోహన్‌ హత్యకు గురైన ఘటనలో చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురికి మినహా మిగిలిన వారందరికీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కేసు ప్రాధాన్యం దృష్ట్యా కోర్టు ఆవరణలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసమూర్తి, ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు సారథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టారు. కఠారి అనుచరులు భారీ సంఖ్యలో రావడంతో కొంత టెన్షన్‌ నెలకొంది. ఈ కేసులో రెండో సాక్షిని కోర్టు సోమవారం విచారించనుంది.

Updated Date - 2023-02-18T00:50:36+05:30 IST