Wrestlers : క్రీడల శాఖ మంత్రితో రెజ్లర్ల చర్చలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-07T12:46:16+05:30 IST

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తో రెజ్లర్ల చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.

Wrestlers : క్రీడల శాఖ మంత్రితో రెజ్లర్ల చర్చలు ప్రారంభం
Wrestlers

న్యూఢిల్లీ : కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ (Sports Minister Anurag Thakur)తో రెజ్లర్ల చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఠాకూర్ ట్విటర్ వేదికగా చేసిన ప్రకటనకు సానుకూల స్పందన లభించింది. రెజ్లర్లు శనివారం రాత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. ఆయన తమను లైంగికంగా వేధించారని, బెదిరించారని ఆరోపిస్తూ, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చలు జరిపేందుకు వారిని తాను మరోసారి ఆహ్వానించానని చెప్పారు. ఈ ఆహ్వానాన్ని రెజ్లర్లు అంగీకరించి, ఠాకూర్ నివాసంలో చర్చల్లో పాల్గొన్నారు.

రెజ్లర్లు శనివారం రాత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఒలింపిక్ పతక విజేతలు బజ్రంగ్ పూనియా ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఈ సమావేశం గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని నిరసనకారులకు చెప్పారని తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని అమిత్ షా చెప్పారన్నారు. తమ నిరసన ముగిసిపోలేదని తెలిపారు. ప్రభుత్వ స్పందన తమకు సంతృప్తికరంగా లేదన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు.

అమిత్ షాను కలిసినవారిలో బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కొందరు డబ్ల్యూఎఫ్ఐ సిబ్బందిని కూడా పోలీసులు ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ ఢిల్లీ నివాసంలో పని చేస్తున్నవారిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మంగళవారం మాట్లాడుతూ, రెజ్లర్లు కోరిన మీదట జూన్ 9న వారికి మద్దతుగా తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే తాము వారికి మద్దతును ఉపసంహరించలేదన్నారు. అమిత్ షాతో రెజ్లర్లు సమావేశమైన విషయం తనకు తెలుసునని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!

Air India : అర్థాంతరంగా రష్యాలో దిగిన ఎయిరిండియా విమానం.. సహాయక విమానం కోసం ప్రయాణికుల ఎదురు చూపులు..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-07T12:46:16+05:30 IST