Liquor Scam: విచారణకు రండి... కేజ్రీవాల్కి 4వసారి సమన్లు పంపిన ఈడీ
ABN, Publish Date - Jan 13 , 2024 | 09:08 AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ(ED) మళ్లీ సమన్లు పంపింది. మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపడం ఇది నాలుగో సారి. తాజాగా ఆయన్ని జనవరి 18న ఈడీ ముందు హాజరుకావాలని కోరింది.

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ(ED) మళ్లీ సమన్లు పంపింది. మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపడం ఇది నాలుగో సారి. తాజాగా ఆయన్ని జనవరి 18న ఈడీ ముందు హాజరుకావాలని కోరింది. ఆయనకు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాల్సిందిగా రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అరవింద్ గైర్హాజరుకావడంతో జనవరి 3న మూడో సారి పంపింది. అప్పుడూ కేజ్రీవాల్(Arvind Kejriwal) దాటవేశారు. తరువాత ఈడీ తీసుకునే చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు తమ నేతని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు.
ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. సాధారణంగా మూడు సార్లు సమన్లు జారీ చేశాక ఈడీకి అరెస్ట్ చేసే అధికారం వస్తుంది. అందుకు భిన్నంగా కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరుకావాలని కోరుతూ మరోసారి సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా(Manish Sisodia) 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను అక్టోబర్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అనేక మంది పార్టీ నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు లిక్కర్ కంపెనీల నుంచి అధికార (ఆప్) పార్టీ నేతలకు వందలాది కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయని, అందుకే ప్రయివేట్ వ్యక్తులకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేసిందన్నది ప్రధానమైన ఆరోపణ. ఢిల్లీ కొత్త మద్యం పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతోపాటు వారి సన్నిహితులకు కూడా ఈ అవినీతి, అక్రమాల్లో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 13 , 2024 | 09:09 AM