Budget : విపక్ష రాష్ట్రాలపై వివక్ష
ABN, Publish Date - Jul 25 , 2024 | 05:33 AM
బడ్జెట్ కేటాయింపుల ప్రకంపనలు పార్లమెంటును కుదిపేశాయి. ఇది ‘కుర్చీ బచావో’ బడ్జెట్ అని, ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఏపీ, బిహార్లకు బడ్జెట్లో పెద్దపీట వేశారని.. మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనతో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర
భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి
కేంద్ర బడ్జెట్పై ‘ఇండియా’ ఆగ్రహం
పార్లమెంటు నుంచి వాకౌట్
ప్రాంగణంలో ఎంపీల నిరసన
పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
‘మాతాజీ’ మాటల నేర్పరి
బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు
బడ్జెట్లో మొండిచెయ్యి
ఆ రెండు రాష్ట్రాలకే విందు: ఖర్గే
రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా?
వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు
తెలుస్తాయ్: నిర్మలా సీతారామన్
27న నీతి ఆయోగ్ సమావేశాన్ని
బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్ కేటాయింపుల ప్రకంపనలు పార్లమెంటును కుదిపేశాయి. ఇది ‘కుర్చీ బచావో’ బడ్జెట్ అని, ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఏపీ, బిహార్లకు బడ్జెట్లో పెద్దపీట వేశారని.. మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనతో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని విపక్ష ఇండియా కూటమి బుధవారం ఆరోపించింది. ఏ రాష్ట్రానికీ న్యాయం చేయలేదని.. ఇది భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపైనే దాడిగా అభివర్ణిస్తూ.. ఉభయసభల నుంచి కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో.. బడ్జెట్ కేటాయింపుల అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష సభ్యులు యత్నించారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవద్దని స్పీకర్ ఓం బిర్లా కోరారు. పథకం ప్రకారమే సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. సభ్యులు సభలోకి రాకుండా విపక్ష ఎంపీలు మెట్ల వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారని ఆయనతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ప్రస్తావించారు. కేటాయింపుల అంశాన్ని ప్రస్తావించనివ్వడం లేదంటూ విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాజ్యసభలోనూ విపక్ష పాలిత రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడంపై ఇండియా కూటమి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 267 నిబంధన కింద ప్రశ్నోత్తరాలు, ఇతర ఎజెండాను సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని నోటీసు ఇచ్చారు. దానిని సభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘2024-25 బడ్జెట్లో బిహార్, ఆంధ్రకు మాత్రమే నిధులు, పథకాలు ఇచ్చారు. మిగతా రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఈ బడ్జెట్ ‘కుర్సీ బచావో డాక్యుమెంట్’ అని ఆరోపించారు. ఈ వివక్షను కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు ఖండిస్తున్నాయన్నారు. దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చైర్మన్ అవకాశమిచ్చారు. ఆమె మాట్లాడేందుకు లేవగానే విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. వారి ఆరోపణలు దారుణమని నిర్మలా సీతారామన్ ఆక్షేపించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించనంత మాత్రాన విస్మరించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. తమ రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రజల్లో నాటేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తాజా బడ్జెట్లోనే కాదని.. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తాను చాలా రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదన్నారు. దానర్థం కేంద్ర పథకాలు ఆ రాష్ట్రాల్లో అమలు కావడం లేదనా అని నిలదీశారు. ఈ రెండు బడ్జెట్లలో మహారాష్ట్ర పేరును కూడా తాను ప్రస్తావించలేదని.. అయినా ఆ రాష్ట్రంలో రూ.76 వేల కోట్ల భారీ పెట్టుబడితో వధావన్ పోర్టు ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించిందని గుర్తుచేశారు. ‘ఫలానా రాష్ట్రం పేరు బడ్జెట్లో ప్రస్తావించలేదని.. కేంద్రప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రపంచబ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీ తదితర ఆర్థిక సంస్థల ద్వారా అమలు చేసే విదేశీ రుణ సాయం ప్రాజెక్టులు (ఈఏపీ) ఈ రాష్ట్రాలకు రావా? ప్రభుత్వం ఇచ్చిన వ్యయ ప్రకటన చూస్తే దేనికెంత కేటాయింపులు జరిపారో తెలుస్తుంది. దమ్ముంటే గతంలో కాంగ్రెస్ ఆర్థిక మంత్రులు చేసిన బడ్జెట్ ప్రసంగాలను ఇవ్వండి. వాటిలో ప్రతి రాష్ట్రం పేరును వారు ప్రస్తావించారా? ఇది దారుణమైన ఆరోపణ. ఆమోదనీయం కాదు’ అని స్పష్టం చేశారు. వాకౌట్ చేసిన కొందరు టీఎంసీ ఎంపీలు ఇదే సమయంలో సభలోకి వచ్చారు. బెంగాల్కు ఏమీ ఇవ్వలేదని వారు ఆరోపించారని.. ప్రధాని మోదీ గత పదేళ్లలో ప్రారంభించిన చాలా పథకాలు ఆ రాష్ట్రంలో అమలు కావడం లేదని నిర్మల తెలిపారు. టీఎంసీ ఎంపీలు ఖండించారు. తమ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్ష కోట్ల బకాయి ఉందని ఆరోపించారు.
పార్లమెంటు మెట్ల వద్ద విపక్ష ఎంపీల నిరసన
బుధవారం పార్లమెంటు మకర ద్వారం మెట్ల వద్ద విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ఇతర రాష్ట్రాలను విస్మరించడం.. భారత సమాఖ్య పవిత్రతపైనే దాడి అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నిరసనలో ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉభయసభల్లో ఆ పార్టీ ఉపనేతలు ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ (ఎస్సీపీ) నాయకుడు శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్, టీఎంసీ, డీఎంకే. జేఎంఎం, ఆప్, సీపీఎం తదితర విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ
బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ప్రమాదకరమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిందని, ఇందుకు నిరసనగా శనివారం (27న) ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీని కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలు బహిష్కరిస్తారని చెప్పారు.
మాటల్లో నిర్మల ఎక్స్పర్ట్
బడ్జెట్పై చర్చ సందర్భంగా నిర్మలపై ఖర్గే విమర్శలు సంధించారు. ఆమెను ‘మాతాజీ’ అని సంభోదించారు. ‘మాతాజీ మాటలు చెప్పడంలో నేర్పరి అని నాకు తెలుసు’ అని ఎద్దేవాచేశారు. చైర్మన్ ధన్ఖడ్ స్పందిస్తూ.. నిర్మలను అమ్మలా కాకుండా కుమార్తెగా చూడాలని ఖర్గేకు సూచించారు. ప్రతిపక్ష నేత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. దేశ అవసరాల కోసం కాకుండా.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. ‘మోదీ సర్కారు బడ్జెట్లో ఏ రాష్ట్రానికీ ప్రయోజనం కలుగలేదు. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఛత్తీ్సగఢ్ వంటి ప్రధాన రాష్ట్రాలను విస్మరించారు. ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. ప్రతి వారి ప్లేటు ఖాళీ. రెండు రాష్ట్రాల ప్లేట్లలో మాత్రం పకోడీ, జిలేబీ పెట్టారు. ఇలాంటి బడ్జెట్ నేను ఇప్పటివరకు చూడలేదు’ అని ఎద్దేవాచేశారు.
Updated Date - Jul 25 , 2024 | 05:39 AM