NITI Aayog: నేడు నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం
ABN, Publish Date - Jul 27 , 2024 | 07:19 AM
నేడు నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షన జరుగుతున్న సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ భవనంలో ఈ సమావేశం జరగనుంది.
ఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ (NITI Aayog) 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షన జరుగుతున్న సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక భవనంలో ఈ సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సైతం హాజరవుతున్నారు. కేంద్ర బడ్జెట్ (Central Budget)లో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు సిద్దరామయ్య (Siddaramaiah), సుఖ్విందర్ సింగ్ సుఖూ (Sukhwinder Singh Sukhu) ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వికసిత్ భారత్ 2047 కి రోడ్ మ్యాప్ను నీతి ఆయోగ్ పాలకమండలి రూపొందించనుంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామం, సహకారం, గ్రామీణ, పట్టణ జనాభా జీవన ప్రమాణాల పెంపు తదితర అంశాలపైనా పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. సులభతర జీవనం, భవిష్యత్తు అభివృద్ధి, భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం లాంటి అంశాలపైనా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు సలహాలు, సూచనలు చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన మూడవ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులపైనా పాలకమండలి సమావేశంలో చర్చ జరగనుంది.
తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్య, భూమి, ఆస్థి అనే ఐదు అంశాలపైన ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలకమైన సిఫార్సులు చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ, ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాక్ల కార్యక్రమం, రాష్ట్రాల పాత్ర , పరిపాలనలో కృత్రిమ మేథ లాంటి అంశాలపైనా మూడవ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సులో కూడా చర్చించనున్నారు. మూడవ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం సిఫార్సులను నీతిఆయోగ్ 9వ పాలకమండలి సమావేశంలో ఆమోదించనున్నారు. కాగా.. కేంద్ర బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని.. ఇదే అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో లేవనెత్తేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్
Read more National News and Telugu News
Updated Date - Jul 27 , 2024 | 07:19 AM