Share News

చార్‌ధామ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:23 AM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక అధికారులు చార్‌ధామ్‌ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గెర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. యాత్రికులు రుషికేశ్‌ను

చార్‌ధామ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

భారీవర్షాల నేపథ్యంలో నిర్ణయం

వరదలతో గోవా, మహారాష్ట్రల్లో పలుచోట్ల చిక్కుకుపోయిన జనం

డెహ్రాడూన్‌, పనాజీ, ముంబై, జూలై 7: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక అధికారులు చార్‌ధామ్‌ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో యాత్రికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని గెర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. యాత్రికులు రుషికేశ్‌ను దాటివెళ్లవద్దని, ఇప్పటికే యాత్రలో ఉన్న వాళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోవాలని హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు బద్రీనాథ్‌కు వెళ్లి మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా కొండచరియలు పడి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. రుషికేశ్‌లోని గంగానదిలో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకోవటంతో తీరప్రాంతంలోని ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు.

జలపాతం వద్ద చిక్కుకున్న పర్యాటకులు

భారీ వర్షాలతో గోవా, మహారాష్ట్రల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. గోవాలోని సత్తారీ తాలూకాలో ఆదివారం ఓ జలపాతం వద్దకు వెళ్లిన పర్యాటకులు.. అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. అధికారులు 50 మందిని రక్షించారు. మరో 30 మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్పీ అక్షత్‌ కౌశల్‌ తెలిపారు. మహారాష్ట్ర థానే పరిధిలో ఓ రిసార్టు వరద ముంపునకు గురవటంతో అక్కడున్న 49 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ రక్షించింది. పాల్ఘాట్‌ జిల్లాలో 16మంది గ్రామీణులు వరద ప్రవాహంలో చిక్కుకుపోగా ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు.

Updated Date - Jul 08 , 2024 | 05:23 AM